: అత్యవసర సమయంలో, మ్యాన్ హోల్స్ పై 100, 040-21111111 నెంబర్లకు సమాచారమివ్వండి : కేటీఆర్

హైదరాబాద్ నగరంలో భారీ వర్షాల నేపథ్యంలో మంత్రి కేటీఆర్ జీహెచ్‌ఎంసీ కార్యాలయంలో మంత్రులు, అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరద ప్రభావిత ప్రాంతాల్లో అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయని అన్నారు. అత్యవసర పరిస్థితులు తలెత్తితే ఆర్మీ, ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు వాటిని ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉన్నాయని తెలిపారు. మంత్రులు, ప్రజాప్రతినిధులంతా రేయింబవళ్లు ప్రజల మధ్యనే ఉండాలని సీఎం కేసీఆర్ ఆదేశించారని తెలిపారు. ప్రభుత్వ యంత్రాంగమంతా అప్రమత్తంగా ఉందని కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు, మంత్రులంతా క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తున్నారని అన్నారు. పోలీస్ యంత్రాంగమంతా అప్రమత్తతో ఉందని, ట్రాఫిక్ వీలైనంత తక్కువ అసౌకర్యంతో క్లియర్ చేస్తున్నామని వెల్లడించారు. అందరం కలిసి ఎటువంటి సమస్యనైనా ఎదుర్కోడానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. ఐటీ కంపెనీలు కూడా వీలైనంతవరకూ వారి ఉద్యోగులకు ఇంటి నుంచి పనిచేసే సౌకర్యం కల్పించాలని సూచించారు. అనుమతి లేకుండా మ్యాన్‌హోల్స్‌ను ఎవరూ తెరవవద్దని మంత్రి కేటీఆర్ నగరవాసులకు సూచించారు. మ్యాన్ హోల్స్ పై 100, 21111111 నెంబర్లకు సమాచారమివ్వాలని అన్నారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, సీపీ మహేందర్‌రెడ్డి, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

More Telugu News