: అనూహ్యంగా పులిచింతలకు 4 లక్షల క్యూసెక్కులు దాటిన వరదనీరు

అధికారులు ఊహించినట్టుగానే పులిచింతల ప్రాజెక్టుకు భారీ వరదనీరు వచ్చి చేరుతోంది. ఈ మధ్యాహ్నం 3:30 గంటల సమయంలో పులిచింతల ప్రాజెక్టుకు 4 లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరింది. ప్రాజెక్టు 15 గేట్లనూ ఎత్తివేసిన అధికారులు వచ్చిన నీటిని వచ్చినట్టు వదులుతున్నారు. ప్రాజెక్టులో 29 టీఎంసీలకు మించి నీరు నిల్వ ఉందని వెల్లడించారు. కాగా, ఈ వరద నీటి ప్రభావంతో అటు గుంటూరు, ఇటు నల్గొండ జిల్లాల్లోని 9 గ్రామాల్లోకి నీరు ప్రవేశించింది. ఇప్పటికే గ్రామాల్లోని ప్రజలను ముందు జాగ్రత్త చర్యగా పునరావాస శిబిరాలకు తరలించారు. పులిచింతలకు వరద మరింతగా పెరగవచ్చని, ఒక్క చంద్రవంక నుంచే లక్ష క్యూసెక్కుల నీరు వస్తోందని, ఇది మరింతగా పెరిగే అవకాశాలు ఉన్నాయని అధికారులు భావిస్తున్నారు. ఈ ఉదయం దేవినేని ఉమ, తెలంగాణ మంత్రి హరీశ్ రావుకు ఫోన్ చేసి పులిచింతలకు 2.5 లక్షల క్యూసెక్కుల వరద రావచ్చని చెప్పిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అంతకుమించిన వరద నీరు వస్తోంది.

More Telugu News