: పేపర్ లెస్ కార్యక్రమాలకు కేరళ అసెంబ్లీ సిద్ధం

ఇప్పటికే పేపర్ లెస్ కార్యక్రమాలు నిర్వహిస్తున్న హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ సరసన కేరళ కూడా చేరనుంది. అసలు కాగితమనేది అవసరం లేకుండా సభా వ్యవహారాలు నడిపేందుకు కేరళ అసెంబ్లీ సిద్ధమైంది. ఈ మేరకు ఒక ప్రకటన చేసింది. ఈ సందర్భంగా కేరళ అసెంబ్లీ స్పీకర్ పి.శ్రీరామకృష్ణన్ మాట్లాడుతూ, హిమాచల్ ప్రదేశ్ ఇప్పటికే ఈ ఘనత సాధించిందని, తాము కూడా ఆ మార్గంలో నడవాలనుకుంటున్నామని అన్నారు. ఈ నెల 26న కేరళ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయని.. మొత్తం 29 రోజుల పాటు ఈ సమావేశాలు జరిగే అవకాశముందని అన్నారు. పేపర్ లెస్ కార్యక్రమాల నిర్వహణపై ఇప్పటికే 144 మంది ఎమ్మెల్యేలకు సూచనలు చేశామన్నారు. ఆన్ లైన్ లోనే ప్రశ్నలు అడగాలని సూచించామన్నారు. పూర్తి స్థాయి పేపర్ లెస్ కార్యక్రమం కోసం తమ చట్ట సభ్యులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్లు చెప్పారు. ఈ శిక్షణ పూర్తికాగానే ప్రతి ఎమ్మెల్యే ముందు ఒక కంప్యూటర్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. కేవలం ఒకే ఒక్క క్లిక్ ద్వారా సభా కార్యక్రమాలను చూడవచ్చని శ్రీరామకృష్ణన్ చెప్పారు.

More Telugu News