: 3.9 కోట్లు కొట్టేస్తే... 2 కోట్లు ఉంచుకుని...దొంగలకు 1.9 కోట్లు పంచిన పోలీసులు!

దొంగిలించిన డబ్బును దొంగలు, పోలీసులు కలిసి పంచుకున్న ఘటన తమిళనాడులోని కోయంబత్తూరులో చోటుచేసుకుంది. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే...కేరళలోని మలప్పురంలో ఓ బంగారు వ్యాపారి వద్ద పనిచేసే నలుగురు వ్యక్తులు గత ఆగస్టు 25న చెన్నైలో యజమాని చెప్పినట్టు నగలు అమ్మి, ఆ డబ్బు తీసుకుని కారులో మలప్పురంకు తిరుగుప్రయాణమయ్యారు. మార్గమధ్యంలో ఐదుగురు వ్యక్తులు కారును అడ్డుకున్నారు. వారిలో ముగ్గురు వ్యక్తులు యూనిఫాంలో ఉండడంతో వారు కారును ఆపారు. తనిఖీలు చేయాలని కిందికి దిగాలని ఆదేశించడంతో ఆ నలుగురూ కిందికి దిగారు. దీనిని అవకాశంగా తీసుకున్న ఆ వ్యక్తులు కారుతో ఉడాయించారు. దీంతో బాధితులు లబోదిబోమంటూ యజమానికి ఫిర్యాదు చేయగా, ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదుచేసిన పోలీసులు, దర్యాప్తు చేపట్టారు. వారి దర్యాప్తులో ఈ దోపిడీలో పోలీసుల హస్తం కూడా ఉందని గుర్తించారు. నిందితులు ముగ్గుర్ని అదుపులోకి తీసుకుని విచారించగా, దొంగిలించిన 3.9 కోట్ల రూపాయలను పోలీసులు, దొంగలు కలసి పంచుకున్నారని వెల్లడైంది. మొత్తం 3.9 కోట్ల రూపాయల్లో 2 కోట్ల రూపాయలను పోలీసులు తీసుకుని, మిగిలిన 1.9 కోట్ల రూపాయలను దొంగలకు పంచిపెట్టారని వారు తెలిపారు. దీంతో ఒక పోలీస్ ఇన్ స్పెక్టర్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు, పరారీలో ఉన్న మరో ఇన్ స్పెక్టర్, హెడ్ కానిస్టేబుల్ కోసం గాలిస్తున్నారు.

More Telugu News