: సుప్రీం ఆదేశించినా కావేరీ జలాలను వదలని కర్ణాటక

కావేరి జ‌లాల వివాదంపై క‌ర్ణాట‌క స‌ర్కారు వేసిన‌ పిటిష‌న్‌పై విచార‌ణ జ‌రిపిన‌ సుప్రీం ఈనెల 27 వ‌ర‌కు తమిళనాడుకు 6 వేల క్యూసెక్కుల చొప్పున నీరు విడుద‌ల చేయాల‌ని ఆదేశాలు జారీ చేసిన విష‌యం తెలిసిందే. అయితే, సుప్రీంకోర్టు తీర్పుని క‌ర్ణాట‌క ప్ర‌భుత్వం పాటించ‌డం లేదు. క‌ర్ణాట‌క‌లోని మాండ్యాతో పాటు ప‌లు ప్రాంతాల రైతులు నిన్న, మొన్న రోడ్ల‌పైకి వ‌చ్చి పెద్ద ఎత్తున ఆందోళనలు తెలిపారు. ఈ పరిస్థితుల్లో నిన్న సిద్ధ‌రామ‌య్య ప్ర‌భుత్వం సుదీర్ఘంగా, స‌మ‌గ్రంగా చ‌ర్చించి నీటి విడుదలను మరో 2 రోజులపాటు వాయిదా వేసింది. జ‌లాల విడుద‌ల‌పై చర్చించడానికి రేపు ఆ రాష్ట్ర‌ గవర్నరు అనుమతితో ఉభయ సభలను స‌మావేశ‌ప‌ర‌చాల‌ని నిన్న జ‌రిగిన‌ అఖిలపక్ష, మంత్రివర్గ భేటీల అనంత‌రం క‌ర్ణాట‌క ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. జలవివాదంపై జ‌రిగిన‌ అఖిలపక్ష భేటీకి బీజేపీ నేత‌లు డుమ్మాకొట్టారు. ఈ అంశంపై ఆ రాష్ట్ర బీజేపీ నేత‌లు ప్రధాని నరేంద్ర మోదీని కలిసి, అందులో జోక్యం చేసుకోవాల‌ని కోరారు. అయితే, అందుకు మోదీ నిరాకరించినట్లు తెలుస్తోంది.

More Telugu News