: షరీఫ్ నోట బుర్హాన్ ప్రస్తావనతో భారత్ కు షాక్!

ఐక్యరాజ్యసమితి సాధారణ సమావేశంలో పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ నోట హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్రవాది, సైన్యం ఎన్ కౌంటర్ లో మరణించిన బుర్హాన్ వనీ పేరు రావడం భారత్ కు షాక్ ను కలిగించిందని విదేశాంగ శాఖ వెల్లడించింది. ఓ దేశపు నేత, మరో దేశంలో మారణహోమం సృష్టించేందుకు యత్నించిన వ్యక్తిని కీర్తించడంతోనే, ఆ దేశం ఉగ్రవాదానికి ఎంతగా మద్దతు పలుకుతోందో తెలుస్తోందని విదేశాంగ శాఖ సహాయమంత్రి ఎంజే అక్బర్ వ్యాఖ్యానించారు. ఉగ్రవాదులపై పాక్ వైఖరి ఎన్నో ఏళ్లుగా మారలేదని, తుపాకుల మోతల మధ్య చర్చలు సాగబోవని ఆయన స్పష్టం చేశారు. మరోవైపు షరీఫ్ ప్రసంగం ముగిసిన క్షణాల తరువాత విదేశాంగ శాఖ ప్రతినిధి వికాస్ స్వరూప్ ట్వీట్ చేస్తూ, యూరీ ఉగ్ర దాడి వెనుక పాక్ హస్తం లేదని షరీఫ్ చెప్పడాన్ని ఖండించారు. ఈ సంవత్సరం వాస్తవాధీన రేఖ వద్ద 19 చొరబాటుయత్నాలను తాము విఫలం చేశామని గుర్తు చేశారు.

More Telugu News