: నేడే టీమిండియా ప్రతిష్ఠాత్మక 500వ టెస్టు

టీమిండియా ప్రతిష్ఠాత్మక 500వ టెస్టు మ్యాచ్ నేడే ప్రారంభం కానుంది. టెస్టు క్రికెట్ లో ప్రవేశించే నాటికి టీమిండియా పసికూన. ఇంగ్లండ్, వెస్టిండీస్, ఆస్ట్రేలియా లాంటి జట్లతో తలపడడం అంటే అప్పట్లో సవాలే. సరైన ప్యాడ్లు, హెల్మెట్ సౌకర్యాలు కూడా లేని రోజుల్లో భారత్ కు ప్రాతినిధ్యం వహించడం సవాల్ తో కూడుకున్నది. క్రికెట్ తొలినాళ్లలో రాజవంశీయుల పాత్ర అధికంగా గల ఈ క్రీడలో సత్తాచాటి, ఇది అందరూ ఆడుకునే ఆటగా తీర్చిదిద్దిన ఘనత సీకే నాయుడు, గవాస్కర్, కపిల్ దేవ్, అజహరుద్దీన్, గంగూలీ, సచిన్, కుంబ్లే, ద్రవిడ్, ధోనీ వంటివారికే చెల్లింది. దిగ్గజాల ఆటతీరుతో భారత క్రికెట్ జట్టు సమున్నత శిఖరాలు అధిరోహించింది. వన్డే, టీ20 వరల్డ్ కప్ లు సాధించింది. అంతర్జాతీయ క్రికెట్ లో భారత్ ప్రాతినిధ్యం వహించిన ప్రతి టోర్నీలోను జయకేతనం ఎగురవేసింది. దీంతో భారత్ లో క్రికెట్ అంటే ఆటకాదు మతం అన్నంతగా ప్రాచుర్యం పొందింది. భారత్ లోని ఏ గల్లీలో చూసినా పిల్లలు క్రికెట్ ఆడుతూ కనిపిస్తారంటే ఈ ఆట భారతీయులను ఎంతగా పెనవేసుకుపోయిందో మనకు అర్థం అవుతుంది. క్రికెట్ అంతగా ఇక్కడి వారి జీవితాలలో భాగమైపోయింది. అగ్రశ్రేణి జట్టుగా టీమిండియా ఎదగడంతో పాటు ప్రపంచంలోనే అత్యంత ఆర్థిక సంపద కలిగిన బోర్డుగా బీసీసీఐ నిలిచింది. ఈ నేపథ్యంలో టీమిండియా నేడు తన ప్రతిష్ఠాత్మకమైన 500వ టెస్టును న్యూజిలాండ్ తో ఆడనుంది. ఈ సందర్భంగా టీమిండియాకు విశిష్ట సేవలందించిన మాజీ కెప్టెన్లందరినీ బీసీసీఐ సత్కరించనుంది. ఈ సందర్భంగా అతిథులకు 500 వంటకాలతో కూడిన విందు ఇవ్వనుంది.

More Telugu News