: భారత్ నుంచి భారీ పోటీ ఉంది... మనం ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించుకోవాలి: చైనా పత్రిక కథనం

ఉత్పత్తి రంగంలో భారత్ దూసుకొస్తోందని, అందుకని జాగ్రత్తగా వుండాలని చైనా ఉత్పత్తి రంగానికి చైనా ప్రభుత్వ పత్రిక గ్లోబల్ టైమ్స్ హెచ్చరికలు చేసింది. చైనా ఉత్పత్తి పరిశ్రమకు ఊహించిన దానికన్నా భారీ స్థాయిలో భారత్ తయారీ రంగం పోటీ ఇస్తోందని తెలిపింది. ఇందుకు తక్షణం చేపట్టాల్సిన చర్యలుగా ఉత్పత్తి వ్యయాలను తగ్గించుకోవాల్సిన అసవరం ఉందని సూచించింది. అంతే కాకుండా చైనాలోని ఉత్పత్తి రంగంలో ఇస్తున్న భారీ వేతనాలు కూడా పరిశ్రమలకు భారంగా మారాయని ఆ పత్రిక తెలిపింది. 2008 నుంచి చైనాలో వేతనాలు 10.6 శాతం పెరిగాయని తెలిపిన ఈ పత్రిక, అదే సమయంలో భారత్ లో వేతనాల పెరుగుదల కేవలం 0.2 శాతంగా మాత్రమే ఉందని వెల్లడించింది. దీంతో భారత్ అతితక్కువ వ్యయప్రయోజన దేశంగా ఉందని తెలిపింది. దీంతో వివిధ పరిశ్రమలు భారత్ లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయని. ఇది మరింత పెరిగితే చైనా నష్టపోయే ప్రమాదం ఉందని హెచ్చరించింది. చైనా ఉత్పత్తి పరిశ్రమలను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని, అందుకు రియాల్టీ రంగంపై ఆధారపడడాన్ని చైనా తగ్గించుకోవాలని హెచ్చరించింది. అదే సమయంలో అలా తగ్గించుకున్న పెట్టుబడులను తయారీ రంగంలో పెట్టాలని ఆ పత్రిక సూచించింది. భారత్ తో పోలిస్తే చైనాలో ఉత్పత్తి వ్యయం పెరగడంతో 'హువాయ్' మొబైల్ ఫోన్ల పరిశ్రమ అక్కడికి తరలిపోయిందని ఆ పత్రిక గుర్తుచేసింది. అణు విద్యుత్ పరిశ్రమ వంటి సాంకేతిక రంగాల అభివృద్ధి, సేవలపై దృష్టి పెట్టిన చైనా, ఉత్పత్తి రంగాన్ని నిర్లక్ష్యం చేయకూడదని సూచించింది. భారత్ వృద్ధికి అడ్డుకట్టవేయాలంటే మరిన్ని మెరుగైన విధానాలు అవలంబించాలని ఆ పత్రిక అభిప్రాయపడింది.

More Telugu News