: రూ. 17 వేల కోట్లు నష్టపోయిన స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లు

వరుస లాభాల తరువాత ఈక్విటీలను విక్రయించి లాభాలను వెనకేసుకునేందుకు ఇన్వెస్టర్లు చూడటం, మరోవైపు ఐసీఐసీఐ ప్రూడెన్షియల్ లైఫ్ ఐపీఓ వాటాల కోసం బిడ్ దాఖలు వేయడానికి అవసరమయ్యే నిధుల కోసం చిన్న ఇన్వెస్టర్లు వాటాల విక్రయాలు జరిపిన వేళ, స్టాక్ మార్కెట్ స్వల్పంగా నష్టపోయింది. సోమవారం నాడు రూ. 1,11,39,747 కోట్లుగా ఉన్న బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాప్ నేడు రూ. 1,11,12,091 కోట్లకు తగ్గగా, ఇన్వెస్టర్ల సంపద రూ. 17 వేల కోట్లకు పైగా హరించుకుపోయింది. చిన్న, మధ్య తరహా కంపెనీల్లో సైతం అమ్మకాల ఒత్తిడి కనిపించింది. మంగళవారం నాటి మార్కెట్ సెషన్ ముగిసేసరికి, బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్ సెన్సెక్స్ సూచిక 111.30 పాయింట్లు పడిపోయి 0.39 శాతం నష్టంతో 28,523.20 పాయింట్ల వద్ద, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ సూచిక నిఫ్టీ 32.50 పాయింట్లు పడిపోయి 0.37 శాతం నష్టంతో 8,775.90 పాయింట్ల వద్దకు చేరాయి. బీఎస్ఈ మిడ్ కాప్ 0.09 శాతం, స్మాల్ కాప్ 0.26 శాతం నష్టపోయాయి. ఇక ఎన్ఎస్ఈ-50లో 21 కంపెనీలు లాభపడ్డాయి. యస్ బ్యాంక్, ఇన్ ఫ్రాటెల్, ఓఎన్జీసీ, ఐచర్ మోటార్స్, హిందాల్కో తదితర కంపెనీలు లాభాల్లో పయనించగా, హీరో మోటో కార్ప్, అదానీ పోర్ట్స్, బజాజ్ ఆటో, ఇండస్ ఇండ్ బ్యాంక్, ఏసీసీ తదితర కంపెనీలు నష్టాల్లో నడిచాయి. బీఎస్ఈలో మొత్తం 2,913 కంపెనీల ఈక్విటీలు ట్రేడింగ్ లో పాల్గొనగా 1,197 కంపెనీలు లాభాలను, 1,513 కంపెనీలు నష్టాలను నమోదు చేశాయి.

More Telugu News