: అక్టోబర్ 3 నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. కీలక అంశాలకు పచ్చజెండా ఊపిన టీటీడీ పాలకమండలి

తిరుమల తిరుపతి వేంకటేశ్వరుడి బ్రహ్మోత్సవాల నిర్వహణతో పాటు పలు అంశాలకు ఆమోదముద్ర వేయడమే లక్ష్యంగా సమావేశమైన టీటీడీ పాలకమండలి కీలక అంశాలకు పచ్చజెండా ఊపింది. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన కలియుగ వేంకటేశ్వరుడికి తొమ్మిది రోజుల పాటు తిరుమలలో జరిగే బ్రహ్మోత్సవాలు వ‌చ్చేనెల‌ 3 నుంచి ధ్వజారోహణంతో ప్రారంభించాలని నిర్ణయం తీసుకుంది. ఈ బ్రహ్మోత్సవాలు 11వ తేదీన ముగియనున్నాయి. ఈ బ్రహ్మోత్సవాల స‌మ‌యంలో స్వామివారికి నిర్వ‌హించే ఆర్జిత సేవలు, బ్రేక్‌ దర్శనాలను రద్దు చేయ‌నున్నట్లు పేర్కొంది. ఇవేగాక, ప‌లు కీల‌క అంశాల‌పై తీసుకున్న నిర్ణయాలపై కూడా పాల‌క‌మండ‌లి వివ‌రాలు తెలిపింది. స్విమ్స్ ఆసుప‌త్రికి 13 కోట్ల రూపాయ‌లు కేటాయిస్తుట్లు తెలిపింది. 43 కోట్ల రూపాయ‌ల‌తో తమ ఆధ్వర్యంలోని 'బర్డ్' ఆసుప‌త్రి విస్తరణ పనులు చేప‌ట్ట‌నున్నట్లు పేర్కొంది. తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం ఆధ్వ‌ర్యంలో న‌డుస్తోన్న ఆసుప‌త్రుల్లో మందుల కోసం 3.01 కోట్ల రూపాయ‌లు కేటాయిస్తున్న‌ట్లు తెలిపింది. ఇతర దేశాల్లోనూ శ్రీ‌వారి వైభవోత్సవం, కల్యాణోత్సవం నిర్వహణకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. పాల కొనుగోలు కోసం ఏడాది కాల‌వ్య‌వ‌ధికి 11.28 కోట్ల రూపాయలు కేటాయించింది. 25 కోట్ల రూపాయ‌ల‌తో ఎస్సీ, ఎస్టీ, మత్స్యకార ప్రాంతాల్లో 500 ఆలయాలు నిర్మించ‌డానికి, దీని కోసం మొదటి దశలో 5 కోట్ల రూపాయ‌లు విడుద‌ల చేయాల‌ని నిర్ణయం తీసుకుంది. 8.46 కోట్ల రూపాయ‌ల‌తో 2.25లక్షల కిలోల నెయ్యి కొనుగోలు చేయడానికి అంగీకారం తెలిపింది. ఇవేకాక ప‌లు అంశాల‌పై అధికారుల‌కు ఆదేశాలు జారీ చేసింది.

More Telugu News