: ఫ్యూచర్ గ్రూప్ చేతికి చంద్రబాబు హెరిటేజ్ రిటైల్!

1992లో చంద్రబాబునాయుడు వ్యవస్థాపకుడుగా ప్రారంభమైన హెరిటేజ్ ఫుడ్స్ లో ప్రధాన రిటైల్ విభాగాన్ని ఫ్యూచర్ గ్రూప్ సొంతం చేసుకోనుంది. ఈ మేరకు ఇరు కంపెనీల మధ్యా చర్చలు జరుగుతున్నట్టు హెరిటేజ్ ఫుడ్స్ స్పష్టం చేసింది. తమ డెయిరీ వ్యాపారంతో పాటు హెరిటేజ్ ఫుడ్స్ పేరిట రిటైల్ చైన్ ను సంస్థ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం సంస్థ ఆదాయం రూ. 2,381 కోట్లకు చేరగా, 20 లక్షల మంది ఖాతాదారులను, 3.8 లక్షల చదరపు అడుగుల వ్యాపార స్థలాన్ని కలిగివున్నామని సంస్థ ప్రతినిధి ఒకరు తెలిపారు. సంస్థలో 2,689 మంది ఉద్యోగులు ఉన్నారని వెల్లడించిన అధికారి, డీల్ విలువ ఇంకా ఖరారు కాలేదని తెలిపారు. ఈ వార్త తెలియగానే బీఎస్ఈలో హెరిటేజ్ ఈక్విటీ విలువ ఏకంగా 10.20 శాతం పెరిగింది. ఇక ఈ డీల్ కుదిరితే, విస్తరణ ప్రణాళికలను శరవేగంగా అమలు చేస్తున్న ఫ్యూచర్ గ్రూప్ నకు ఇది నాలుగో డీల్ అవుతుంది. సంస్థ రిటైల్ విక్రయ కేంద్రాలు 850కి పెరుగుతాయి. విదేశీ పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా ఫ్యూచర్ గ్రూప్ ఈ డీల్ కుదుర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది.

More Telugu News