: నా భార్యకు ఏడుగురు భర్తలున్నారు.. ఆమె బారినుంచి కాపాడండి: పోలీసులను ఆశ్రయించిన బాధితుడు

నిజంగా ఇది కాస్త ఆశ్చర్యం కలిగించే వార్తే. తన భార్యకు ఏడుగురు భర్తలు ఉన్నారని, తనను మోసం చేసిన ఆమె నుంచి తనను కాపాడాలంటూ బెంగళూరుకు చెందిన ఓ వ్యక్తి పోలీసులను ఆశ్రయించాడు. నగరంలోని కేజీహళ్లి ప్రాంతానికి చెందిన ఇమ్రాన్.. భార్య యాస్మిన్‌భాను ఆగడాలపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన కంటే ముందు ఆమె ఏడుగురిని పెళ్లిచేసుకుందని, తనను రోజూ హింసిస్తోందని వాపోయాడు. ఆమె ఆగడాల నుంచి తనను కాపాడి న్యాయం చేయాలని కోరాడు. మగవాళ్లను మోసం చేయడమే పనిగా పెట్టుకున్న యాస్మిన్ తనపై రోజూ దాడి చేస్తోందని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఇమ్రాన్ ఫిర్యాదు తర్వాత మరో ఇద్దరు కూడా ముందుకొచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. యాస్మిన్ తమను కూడా మోసం చేసిందంటూ షోయబ్, అఫ్జల్‌లు తెలిపారు. యాస్మిన్ తనను పెద్దమొత్తంలో డబ్బులు అడిగిందని, ఇవ్వనని చెప్పడంతో వదిలి వెళ్లిపోయిందని అఫ్జల్ పేర్కొన్నాడు. యాస్మిన్‌పై ఫిర్యాదుల విషయంలో పోలీసుల ఆచితూచి స్పందిస్తున్నారు. ఆమెపై దాడి కేసు నమోదు చేశారు. మగాళ్లను మోసం చేసిన ఆరోపణలపై కేసు నమోదుకు పరిశీలిస్తున్నారు.

More Telugu News