: నేను విద్వాంసుడను కాదు.. విద్యార్థిని: ఏసుదాసు

తాను విద్వాంసుడను కాదని, విద్యార్థినని ప్రముఖ సినీ నేపథ్య గాయకుడు కేజే. ఏసుదాసు తెలిపారు. తిరుపతిలో 'మనలో ఒకడు' సినిమా ఆడియో సక్సెస్ మీట్ సందర్భంగా ఆయనను సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎవరికీ లభించని వరం తనకు లభించిందని అన్నారు. తనకు ఆది గురువు తన తండ్రి అని ఆయన చెప్పారు. తనకు ఐదేళ్ల వయసు ఉండగా సంగీతం నేర్పించడం మొదలుపెట్టారని ఆయన గుర్తు చేసుకున్నారు. చదువు మానేసినా పర్లేదు కానీ, సంగీతం మాత్రం మానకు అని తన తండ్రి తనతో అన్నారని ఆయన తెలిపారు. అంత గొప్ప దీవెన ఈ తరం పిల్లలకు లభిస్తుందా? అని ఆయన ప్రశ్నించారు. సంగీతం అంటే పాటలు పాడడం అనే భావన ఈ తరం పిల్లల్లో ఉందని, నిజానికి సంగీతం అంటే దేవుడ్ని కొలవడమని ఆయన తెలిపారు. ప్రతి రోజూ ఉదయాన్నే దేవుడ్ని కొలవడం అంత భాగ్యం ఏముంటుందని ఆయన అన్నారు. పాటలు పాడడమే దేవుడిని కొలవడమని ఆయన చెప్పారు. దేవుడి దీవెనలు, గురువుల ఆశీర్వాదాలు, క్రమశిక్షణ ఎలాంటి వారినైనా ఉన్నత స్థానంలో నిలబెడతాయని ఆయన చెప్పారు. తన గొంతే తనకున్న ఆస్తి అని ఆయన తెలిపారు. గాయకులు ప్రధానంగా గుర్తుంచుకోవాల్సింది. ఆరోగ్యంగా ఉండడమని అన్నారు. మంచి అలవాట్లు గొంతును స్థిరంగా ఉంచుతాయని, మంచి సాధన గొంతును ఉన్నతంగా తీర్చిదిద్దుతుందని ఆయన తెలిపారు. శ్రమకోర్చి నిరంతర సాధనతో మంచి పాటలు పాడవచ్చని ఆయన తెలిపారు.

More Telugu News