: యూరీ సెక్టార్ పై ఉగ్రదాడిని ఖండించిన బాలీవుడ్ ... అమితాబ్, షారూఖ్, అద్నాన్ సమీ ఆగ్రహం

కాశ్మీర్ సరిహద్దుల్లోని యూరీ సెక్టార్ పై ఉగ్రవాదుల దాడిని యావద్భారత జాతి ఖండిస్తోంది. బాలీవుడ్ సినీ నటులు ఉగ్రవాదుల పిరికి చర్యపై ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత్ లో స్థిరపడిన పాక్ గాయకుడు అద్నాన్ సమీ ఉగ్రదాడిని ఖండించాడు. ఉగ్రవాదుల చర్యను బుర్రలేనిదిగా మండిపడ్డాడు. దేశాన్ని రక్షిస్తున్న సైనికులను కోల్పోవడం చాలా బాధగా ఉందని అన్నాడు. సైనికుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలియజేశాడు. సాధారణంగా ఆగ్రహం వ్యక్తం చేయని బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్ ఉగ్రదాడిపై మండిపడ్డారు. పిరికిపందల చర్యగా ఉగ్రదాడిని పేర్కొన్నారు. చాలా బాధగా ఉందని, అదే సమయంలో అంతులేని కోపం కూడా వస్తోందని ఆయన తెలిపారు. ఎలాంటి కవ్వింపు చర్యలు లేకుండా ఆకస్మిక దాడి విస్మయం కలిగించిందని ఆయన పేర్కొన్నారు. అమరవీరుల కుటుంబాలకు ప్రాగాఢ సానుభూతి తెలిపిన షారూఖ్ ఖాన్, ఉగ్రవాదుల పిరికి చర్య ఈ వెన్నుపోటు అన్నాడు. భారత ప్రభుత్వం తీవ్రంగా స్పందించి తగిన గుణపాఠం నేర్పుతుందని ఆశిస్తున్నానని పేర్కొన్నాడు. నమ్మశక్యం కావడం లేదని, చాలా బాధగా ఉందని, వీర జవాన్ల కుటుంబాలకు సంతాపం తెలుపుతున్నానని యువ నటి అలియా భట్ ట్వీట్ చేసింది. వీర జవాన్ల ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నానని అనుష్కా శర్మ ట్వీట్ చేసింది. ‘స్వర్గం మండింది. కశ్మీర్ గుండె పగిలింది. సుందర పట్టణం యూరిపై ఉగ్రదాడి కలచివేసింద’ని దర్శకుడు శేఖర్ కపూర్ ట్వీట్ చేశారు. ఘటనపై విచారం వ్యక్తం చేస్తూ రితేష్ దేశ్ ముఖ్, రణ్ దీప్ హుడా, అమీషా పటేల్, మధుర్ భండార్కర్, నేహ శర్మ తదితరులు ట్వీట్ చేశారు.

More Telugu News