: పారా ఒలింపిక్ విజేత దీపా మాలిక్‌కు రూ.4 కోట్లు, ఉద్యోగం.. ప్రకటించిన హర్యాణా ప్రభుత్వం

పారా ఒలింపిక్స్‌లో షాట్‌పుట్‌లో రజత పతకం సాధించిన దీపా మాలిక్‌పై హర్యాణా ప్రభుత్వం కాసుల వర్షం కురిపించింది. ఆమెకు రూ.4 కోట్ల నగదుతోపాటు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వనున్నట్టు శనివారం హర్యాణా క్రీడలు, యువజనశాఖా మంత్రి అనిల్ విజ్ ప్రకటించారు. రియో నుంచి న్యూఢిల్లీ చేరుకున్న ఆమెకు ఇందిరాగాంధీ విమానాశ్రయంలో మంత్రి సాదరస్వాగతం పలికారు. పారా ఒలింపిక్‌లో హర్యాణా క్రీడాకారిణి పతకం సాధించడం గొప్ప విషయమని ఈ సందర్భంగా మంత్రి పేర్కొన్నారు. ఆమె విద్యార్హతలకు తగ్గ ఉద్యోగం ఇస్తామని పేర్కొన్నారు. హర్యాణాలోని సోనిపట్‌కు చెందిన దీపా మలిక్(45) పారా ఒలింపిక్స్‌లో పతకం గెలుచుకున్న తొలి మహిళగా రికార్డు సృష్టించింది. షాట్‌పుట్‌లో దీప రజత పతకం గెలుచుకున్న సంగతి తెలిసిందే. స్పైనల్ ట్యూమర్ కారణంగా 1999 నుంచి దీప వీల్‌చైర్‌కు పరిమితమైంది.

More Telugu News