: మోహన్ బాబు సినీ పరిశ్రమలో ఒక ఇన్స్ స్టిట్యూట్ లాంటి వాడు!: దాసరి నారాయణరావు
వైజాగ్ ప్రజలకు చాలా ఓపిక ఎక్కువని దర్శకరత్న దాసరి నారాయణరావు తెలిపారు. విశాఖపట్టణంలో ఆయన మాట్లాడుతూ, పుట్టినరోజు వేడుక జరుపుకుంటున్న సుబ్బరామిరెడ్డికి శుభాకాంక్షలు అన్నారు. సాయంకాలం 4 గంటలకు వచ్చిన అభిమానులు సుమారు పది గంటలు అవుతున్నా ఇంకా కదలకపోవడం వారి అభిమానానికి తార్కాణమని అన్నారు. ఈవేళ వస్తున్న నటులు రెండు, మూడేళ్ల కాలానికే కెరీర్ ముగించుకుంటుంటే... మోహన్ బాబు 40 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానం ఆదర్శనీయమని అన్నారు. ఈ అంకిత భావం, సుదీర్ఘ చరిత్ర కేవలం మోహన్ బాబుది మాత్రమే కాదు. చిరంజీవిది కూడా అని ఆయన అన్నారు. సుబ్బరామిరెడ్డిని చూసి చాలా సార్లు 'ఫోటోల కోసమా? పబ్లిసిటీ కోసమా? ఎందుకు? ఇంత పెద్ద ఫంక్షన్లు చేస్తుంటాడు?' అనుకునేవాడినని ఆయన అన్నారు. ఇలాంటి సుబ్బరామిరెడ్డి ఇలాంటి వేడుకలు చెయ్యకపోతే కళాకారుల ఘనత ప్రపంచానికి ఎలా తెలుస్తుందని అన్నారు. షూటింగ్ క్యాన్సిల్ చేయించుకుని చిరంజీవి రావడం, జయప్రద, జయసుధ, శ్రీదేవి, యంగ్ స్టార్స్ రావడం వెనుక ఘనత మోహన్ బాబు, సుబ్బరామిరెడ్డికే చెల్లుతుందని ఆయన అన్నారు. విలన్ వేషం వెయ్యగలిగిన వాడు ఆల్ రౌండర్ అయితే శత్రుఘ్న సిన్హా, రజనీకాంత్, మోహన్ బాబు, చిరంజీవి వీరంతా లెజెండ్స్ అని ఆయన అన్నారు. స్క్రీన్ టెస్టు చేసి ఎంపిక కాబడ్డవాడే మోహన్ బాబు అని ఆయన అన్నారు. 'కేటుగాడు' సినిమాతో హీరో అయ్యాడని ఆయన తెలిపారు. 'పాలు-నీళ్లు'తో జయప్రదతో నటించాడని, అది వందరోజులు ఆడిందని ఆయన తెలిపారు. అలా ఎదగాలంటే క్రమశిక్షణ, ప్రతిభ, నిబద్ధత కలిగి ఉండాలని ఆయన చెప్పారు. అవన్నీ ఉండడం వల్లే మోహన్ బాబు విలన్ గా, నటుడిగా, హీరోగా రాణించాడని ఆయన తెలిపారు. తనకు తెలిసి మోహన్ బాబుతో స్నేహం చేసేవారి కంటే ఇతరుల దగ్గర స్నేహం చేసేవారు తక్కువని ఆయన అన్నారు. మోహన్ బాబు సినీ పరిశ్రమలో ఇన్స్ స్టిట్యూట్ లాంటి వ్యక్తి అని అన్నారు. మోహన్ బాబు విద్యాసంస్థను పెట్టి విజయవంతంగా నడుపుతున్నాడని ఆయన తెలిపారు. క్యాస్ట్ కాలమ్ తీసేసిన ఒకే ఒక విద్యాసంస్థ మోహన్ బాబు సంస్థ అని ఆయన చెప్పారు. విలువలు వ్యక్తిత్వంగా చేసుకుని దిగ్గజంగా ఉన్నాడంటే అది గొప్పవిషయమని ఆయన ప్రశంసించారు.