: అరుణాచల్ రాజకీయాల్లో పెను సంక్షోభం.. కుప్పకూలిన కాంగ్రెస్ ప్రభుత్వం

అరుణాచల్ అసెంబ్లీలో కాంగ్రెస్‌కు మ‌రోసారి పెద్ద దెబ్బ త‌గిలింది. శాస‌న‌స‌భ‌లో కాంగ్రెస్ సభ్యుల సంఖ్య రెండుకి ప‌డిపోయింది. ఆ రాష్ట్ర అసెంబ్లీలో 44 మంది ఉన్న‌ కాంంగ్రెస్ ఎమ్మెల్యేల్లో 42 మంది పార్టీకి గుడ్ బై చెప్పారు. రాజీనామా చేసిన ఎమ్మెల్యేలంతా బీజేపీలో చేరే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది. దీంతో మ‌రోసారి అరుణాచ‌ల్ ప్ర‌దేశ్‌లో రాజ‌కీయ సంక్షోభం తలెత్తింది. గత కొన్నాళ్లుగా అరుణాచ‌ల్ ప్ర‌దేశ్‌ రాజకీయ సంచలనాలకు నిలయంగా మారిన విష‌యం తెలిసిందే. రాష్ట్రంలో ఎన్నో ఆశ్చర్యకర పరిణామాలు జ‌రుగుతున్నాయి. సుప్రీంకోర్టు బీజేపీ కి షాక్ ఇస్తూ ఇచ్చిన తీర్పుతో కోల్పోయిన అధికారాన్ని తిరిగి పొందిన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పెమా ఖండూ అధికారంలోకి వచ్చారు. మూడింట రెండు వంతుల మంది ఒకేసారి పార్టీ మారితే వాళ్లకు ఫిరాయింపుల నిరోధక చట్టం వర్తించదన్న విష‌యం తెలిసిందే. అంత‌కు మించిన స‌భ్యులు ఒకేసారి కండువాలు మార్చుతుండ‌డంతో చ‌ట్ట‌ప్ర‌కారం ఏ చ‌ర్య‌లూ తీసుకునే వీలు ఉండ‌దు. దీంతో ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కుప్పకూలిపోనుంది. ఈ ఏడాది మే నెలలోనే ప్రాంతీయ పార్టీ పీపుల్స్ పార్టీ ఆఫ్ అరుణాచల్ ప్రదేశ్, బీజేపీ కలసి మిత్ర‌బంధాన్ని రూపొందించుకున్న‌ విష‌యం తెలిసిందే. తాజా ప‌రిణామంతో బీజేపీ అధికారంలోకి రానుంది. పీఏపీతో క‌లిసి ఆ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయ‌డానికి బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా పావులు క‌దుపుతున్నారు.

More Telugu News