: చరిత్ర సృష్టించనున్న టీమిండియా.. అరుదైన టెస్ట్‌కు మాజీ కెప్టెన్లందరికీ ఆహ్వానం

అరుదైన టెస్ట్‌కు అద్భుత రీతిలో ఏర్పాటు చేస్తోంది బీసీసీఐ. భారత్ ఈ నెల 22న కాన్పూరులో న్యూజిలాండ్‌తో మొదలయ్యే తొలిటెస్ట్‌కు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ఇది టీమిండియాకు 500వ టెస్ట్. ఈ చారిత్రక మ్యాచ్‌ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసిన బీసీసీఐ భారత జట్టు మాజీ కెప్టెన్లు అందరినీ ఆహ్వానించాలని నిర్ణయించింది. ఈ టెస్ట్ మ్యాచ్ చరిత్రలో గుర్తుండిపోయేలా ఏర్పాట్లు చేస్తున్నట్టు బోర్డు సీనియర్ అధికారి, ఉత్తరప్రదేశ్ క్రికెట్ సంఘం(యూపీసీఏ) అధ్యక్షుడు రాజీవ్ శుక్లా తెలిపారు. మ్యాచ్ సందర్భంగా టాస్ వేసేందుకు ‘500వ టెస్ట్’ అని ముద్రించిన ప్రత్యేక వెండి నాణేన్ని ఉపయోగించనున్నారు. అలాగే భారత జట్టు మాజీ కెప్టెన్లు అయిన నారీ కాంట్రాక్టర్, చందూబోర్డే, దిలీప్ వెంగ్‌సర్కార్, కపిల్ దేవ్, రవిశాస్త్రి, సునీల్ గవాస్కర్, సౌరవ్ గంగూలీ, సచిన్ టెండూల్కర్, సెహ్వాగ్, శ్రీకాంత్ తదితరులను ఆహ్వానించి సన్మానించాలని బోర్డు భావిస్తోంది.

More Telugu News