: ప్రతిపక్షాల‌కి మంచి బుద్ధిని ప్ర‌సాదించు గ‌ణేశా..!: ట‌్యాంక్ బండ్ వ‌ద్ద గ‌ణేశుడిని కోరుకున్న‌ మంత్రి త‌ల‌సాని

గణేశుడు ప్రతిపక్షాల‌కి మంచి బుద్ధిని ప్ర‌సాదించాలని తెలంగాణ మంత్రి త‌ల‌సాని శ్రీ‌నివాస్ యాద‌వ్ కోరుకున్నారు. హైద‌రాబాద్‌లోని ట‌్యాంక్ బండ్ వ‌ద్ద భారీ ఎత్తున గ‌ణ‌నాథుని విగ్ర‌హాలు నిమ‌జ్జ‌నానికి చేరుకుంటున్నాయి. అక్క‌డి ఏర్పాట్ల‌ను ప‌రిశీలించిన మంత్రి త‌ల‌సాని మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా మీడియా తలసానిని ఏం కోరుకున్నారు? అని అడిగారు. దీనికి తలసాని సమాధానం ఇస్తూ.. ప్ర‌తిప‌క్ష పార్టీలు ప‌నుల‌కు విఘ్నాలు క‌లిగిస్తున్నాయ‌ని, విఘ్నశ్వ‌రుడు ఆ విఘ్నాల‌ను తొల‌గించాల‌ని తాను కోరుకుంటున్న‌ట్లు వ్యాఖ్యానించారు. ప్ర‌భుత్వం చేస్తోన్న‌ ప‌నుల‌కు ప్ర‌తిప‌క్ష నేత‌లు అడ్డుత‌గలకుండా ఆ విఘ్నేశ్వరుడు చూడాల‌ని ఆయ‌న అన్నారు. దాంతో పాటు రాష్ట్ర ప్ర‌జ‌లు సుఖసంతోషాల‌తో ఉండాల‌ని గ‌ణేశుడిని కోరుకున్న‌ట్లు పేర్కొన్నారు. వ‌ర్షం కురుస్తోన్నా నిమ‌జ్జ‌నానికి పోలీసులు, సంబంధిత‌ సిబ్బంది చ‌క్క‌గా ఏర్పాట్లు చేశారని త‌ల‌సాని కొనియాడారు. వేలాది మంది తరలివస్తున్నట్లు ఆయన చెప్పారు. అన్ని ప్రాంతాల్లో క‌ట్టుదిట్ట‌మైన చ‌ర్య‌లు తీసుకున్నట్లు తెలిపారు. కేసీఆర్ నాయకత్వంలో తమ ప్రభుత్వం ప్రజలు ఏ ఆటంకం కలగకుండా అన్ని విషయాల్లోనూ జాగ్రత్తలు తీసుకుంటోందని పేర్కొన్నారు. నిమ‌జ్జ‌నం సంద‌ర్భంగా భ‌క్తుల‌పై తాము ఎటువంటి ఆంక్ష‌లు విధించ‌లేదని ఆయ‌న అన్నారు. ముంబ‌యి, పుణె త‌రువాత ఆ స్థాయిలో హైద‌రాబాదులోనే గ‌ణ‌నాథుల శోభాయాత్ర‌, నిమ‌జ్జ‌నం జ‌రుగుతుంద‌ని ఆయ‌న అన్నారు. ట్యాంక్ బండ్ లో ఈరోజు రాత్రి 9 గంట‌లలోపే నిమ‌జ్జ‌నాలు పూర్త‌వుతాయ‌ని పేర్కొన్నారు.

More Telugu News