: లాలూ పుత్రరత్నం తేజ్ ప్రతాప్ పక్కనే కనిపించిన మోస్ట్ వాంటెడ్ బంటీ... తీవ్రంగా విమర్శించిన విపక్షాలు

బీహార్ లో గూండారాజ్యం కొనసాగుతోందని విమర్శలు గుప్పిస్తున్న బీజేపీ తదితర విపక్షాలకు మరో అస్త్రం దొరికింది. సివాన్ ప్రాంతంలో జర్నలిస్టు రాజ్ దేవ్ రాజన్ హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొని తప్పించుకు తిరుగుతున్నట్టు పోలీసులు చెబుతున్న మహమ్మద్ కైఫ్ అలియాస్ బంటీ, మంత్రులు, నేతల పక్కనే తిరుగుతున్నా పట్టించుకోవడం లేదన్న విమర్శలు పెరుగుతున్నాయి. నిన్న మాజీ ఎంపీ, భాగల్ పూర్ జైలు నుంచి విడుదలైన షహబుద్దీన్ పక్కనే శనివారం నాడు కనిపించిన బంటీ, ఇప్పుడు రాష్ట్రీయ జనతాదళ్ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ పెద్ద కొడుకు, రాష్ట్ర మంత్రి తేజ్ ప్రతాప్ వెంట కనిపించడంతో, ఆ దృశ్యాలు వైరల్ అయ్యాయి. అయితే, తన వెంట బంటీ ఉన్నాడన్న ఆరోపణలను తేజ్ కొట్టి పారేయడం గమనార్హం. "ప్రచారంలో ఉన్న ఫోటోలు, వీడియోల విషయమై నేనేమీ చేయలేదు. నా చుట్టూ వందలు, వేల మంది తిరుగుతుంటారు. నన్ను కలుస్తుంటారు. ఆరోపణలన్నీ బీజేపీ, ఆర్ఎస్ఎస్ సృష్టే" అన్నారు. ఈ మేరకు ట్వీట్ పెడుతూ, 'సెక్స్ రాకెట్ నడిపినట్లు ఆరోపణలు వచ్చిన ఓ వ్యక్తి, ప్రధాని మోదీతో కలిసున్న చిత్రాన్ని పోస్ట్ చేశారు. ఒకరిపై వేలు చూపించే ముందు సొంతింటిని చక్కదిద్దుకోవాలి' అంటూ సెటైర్ కూడా వేశారు.

More Telugu News