: రాహుల్ సభకు వస్తే మంచాలు తీసుకెళ్లచ్చని చెప్పారు, వచ్చాం: మీర్జాపూర్ ప్రజలు

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సభకు వచ్చి ఆయన ప్రసంగాన్ని వినాలని, సభ ముగిసిన తరువాత ఎవరు కూర్చున్న మంచాన్ని వారు ఎత్తుకుపోవచ్చని కాంగ్రెస్ పార్టీ వారు హామీ ఇస్తేనే తాము వచ్చామని మీర్జాపూర్ వాసులు చెబుతున్నారు. యూపీలో పర్యటిస్తున్న రాహుల్ 'ఖట్ సభ' పేరిట వివిధ ప్రాంతాల్లో మంచాలు వేసి ప్రజలను కూర్చోబెట్టి బహిరంగ సభలు నిర్వహిస్తున్న వేళ, సభ ముగియగానే, మంచాలను తీసుకుని ప్రజలు పరుగులు పెడుతున్న సంగతి తెలిసిందే. రాహుల్ ప్రసంగానికన్నా మంచాలు తీసుకు వెళ్లే ప్రజలకే మంచి పబ్లిసిటీ వస్తుండగా, దీన్నెలా ఆపాలో తెలియక కాంగ్రెస్ నేతలు తలలు పట్టుకుంటున్నారు. "రాహుల్ సభకు వస్తే, మంచాన్ని ఇస్తామని ఓ కాంగ్రెస్ నేత మాకు చెప్పారు. ఆ పార్టీ ఇప్పటివరకూ మాకేమీ ఇవ్వలేదు. ఇప్పటికి కనీసం ఈ మంచమైనా దక్కింది" అని మీర్జాపూర్ సభకు వచ్చి ఓ మంచం పట్టుకెళ్లిన కైలాష్ నాథ్ వ్యాఖ్యానించాడు. కాగా, తన ప్రసంగంలో మోదీని విమర్శించేందుకే రాహుల్ అధిక సమయాన్ని తీసుకున్నారు. ఆయన ధరించిన రూ. 15 లక్షల విలువైన సూట్ నుంచి మొదలు పెడితే, సెల్ఫీల పిచ్చి ఎక్కువని, ఎన్నికల వాగ్దానాలను విస్మరించారని, విదేశాలకే పరిమితమవుతున్నారని విమర్శలు గుప్పించారు.

More Telugu News