: ఒక రోజు ముందే ఖైరతాబాద్ గణపతి నిమజ్జనం... శోభాయాత్రకు తరలిన మహా గణపతి

వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా హైదరాబాద్ లోని ఖైరతాబాద్ లో భాగ్యనగర్ గణేష్ ఉత్సవ కమిటీ ప్రతిష్ఠించే మహా గణపతి విగ్రహాన్ని చూసేందుకు, జంట నగరాల పరిధిలోని ప్రజలే కాకుండా, తెలుగు రాష్ట్రాలలోని వివిధ ప్రాంతాల నుంచి ఎంతో మంది వస్తుంటారు. నిమజ్జనం నాడు, అన్ని విగ్రహాలూ గంగమ్మ ఒడికి చేరిన తరువాత ఖైరతాబాద్ గణేశుడి నిమజ్జనం జరుగుతుంటుంది. ఒక్కో సంవత్సరం నిమజ్జనం మరుసటి రోజు రాత్రి వరకూ విఘ్ననాథుడు వేచి ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. ఈ సంవత్సరం పరిస్థితి అందుకు భిన్నంగా వుంది. పోలీసులు చూపిన ముందుజాగ్రత్తతో, ఇప్పటికే ఖైరతాబాద్ గణపతి భారీ ట్రాలీ ఎక్కేసి నిమజ్జన ఊరేగింపునకు సిద్ధమయ్యాడు. శోభాయాత్రకు ముందు నిలిచేందుకు కదిలాడు. ఈ సంవత్సరం నిమజ్జన కార్యక్రమం అధికారికంగా ఖైరతాబాద్ లో ప్రతిష్ఠించిన వినాయకుడితోనే ప్రారంభమవుతుందని, మధ్యాహ్నం 12 గంటల్లోపు నిమజ్జనం జరుగుతుందని అధికారులు తెలిపారు. దీంతో ప్రతి సంవత్సరమూ, నిమజ్జనం తరువాతి రోజు మాత్రమే తల్లి ఒడికి చేరే గణనాధుడు, ఈసారి ఒక రోజు ముందే కైలాసానికి చేరుతున్నట్లవుతోంది.

More Telugu News