: ముంబయి ఐఐటీ విద్యార్థులను నిద్రపోనివ్వని కోతులు!

అవును, ముంబయి ఐఐటీ క్యాంపస్ విద్యార్థులను కోతులు నిద్రపోనివ్వడం లేదు. గత కొన్నిరోజులుగా వారి హాస్టళ్లపై వానరాలు దాడి చేస్తున్నాయి. ముఖ్యంగా హాస్టల్ క్యాంపస్ లోని 3,5,7,9 వసతి గృహాల్లో ఉండే విద్యార్థులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. విద్యార్థుల ఆహార పదార్థాలు, దుస్తులే కాకుండా, విలువైన ఫోన్లు, ల్యాప్ టాప్ లతో పాటు విలువైన ఎలక్ట్రానిక్ పరికరాలను కూడా లాక్కుపోతున్నాయి. అంతేకాకుండా, వసతి గృహాల్లోని బెడ్లపై వానరాలు నిద్రపోతున్నాయి. హాస్టల్లోని డస్ట్ బిన్ లను చెల్లాచెదురు చేస్తున్న వానరాల పనులకు అంతులేకుండా పోతున్నాయని హాస్టల్ విద్యార్థులు వాపోతున్నారు. ఈ విషయాన్ని ఆన్ లైన క్యాంపస్ మ్యాగజైన్ ‘ఇన్ సైట్’ లో పేర్కొన్నారు. కాగా, ముంబయి ఐఐటీ క్యాంపస్ ప్రాంగణం చుట్టూ అటవీ ప్రాంతం ఉన్నందున వానరాల సమస్య ఉందని, వస్తువులన్నింటినీ జాగ్రత్తగా పెట్టుకోవాలని, ఏ వస్తువునూ బయటపెట్టకుండా హాస్టల్ గదుల్లో ఉంచుకోవాలని కళాశాల డీన్ సౌమ్యా ముఖర్జీ సూచించారు. అంతేకాకుండా, వానరాలను తరిమి కొట్టేందుకు టపాకాయలు పేల్చమని విద్యార్థులకు సూచించారు. వానరాలను తరిమికొట్టేందుకు నిపుణుల సహాయంతో చర్యలు చేపడతామని ఆమె పేర్కొన్నారు.

More Telugu News