: పరిచయస్తులతోనే ఆడవాళ్లకు పెనుముప్పు... నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో కీలక రిపోర్టు

దేశంలో మహిళలపై జరుగుతున్న దాడులు, అత్యాచారాలపై నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో దిగ్భ్రాంతి కలిగించే నిజాలతో కూడిన కీలక రిపోర్టును విడుదల చేసింది. గత సంవత్సరం వచ్చిన లైంగిక దాడులు, అత్యాచార కేసుల్లో 50 శాతం మందికి పైగా నిందితులు ఇరుగు, పొరుగు వారేనని తెలిపింది. అంతకుమించి 95 శాతం కేసుల్లో బాధితులకు తెలిసిన వారే నిందితులని సంచలన విషయాన్ని వెలువరించింది. తెలిసిన వారే మహిళల పట్ల అకృత్యాలకు పాల్పడుతున్నారని, ముఖ్యంగా న్యూఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, సిక్కిం, మేఘాలయా, చండీగఢ్ లలో ఈ తరహా కేసులు నమోదవుతున్నాయని వెల్లడించింది. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో తెలిపిన మరో సిగ్గుపడాల్సిన అంశం, ఇంట్లోనే తండ్రి, మామ, బావలు తదితరులు జరుపుతున్న లైంగిక దాడుల గురించి బయటకు చెప్పుకోలేని కేసులు ఎన్నో ఉన్నాయి. తామెలా స్పందించాలో కూడా వారికి తెలియడం లేదు. కాగా, ఇంట్లోని పెద్దవాళ్లు ఆడపిల్లలకు ఇలాంటి విషయాల పట్ల అవగాహన కలిగించడంలో విఫలమవుతున్నారని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. పాఠశాల స్థాయి నుంచే చైతన్యం తేవాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నారు.

More Telugu News