: కోహ్లీపై విమర్శలు... గంభీర్ ను ఎందుకు పక్కనపెట్టారంటూ నిలదీత

టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సాధారణంగా జట్టును ఎంపిక చేసినప్పుడు సెలెక్టర్లపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తుంటాయి. అయితే చీఫ్ సెలెక్టర్ సందీప్ పాటిల్ తాము ఎంపిక చేసిన ఆటగాళ్ల జాబితా కెప్టెన్ కోహ్లీ, కోచ్ కుంబ్లే చేతిలో పెట్టామని, జట్టును ఎంచుకునే అంతిమ నిర్ణయం వారికే కల్పించామని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో తరచు విఫమలవుతున్న శిఖర్ ధావన్, రోహిత్ శర్మలకు జట్టులో చోటు కల్పించడంపై పలువురు క్రికెట్ అభిమానులు ప్రశ్నిస్తున్నారు. దేశవాళీ క్రికెట్ లో టన్నుల కొద్దీ పరుగులు చేసిన సీనియర్ ఆటగాడు గౌతమ్ గంభీర్ ను పక్కనపెట్టడంపై మండిపడుతున్నారు. దీనిపై గంభీర్ కూడా స్పందించడంతో ఈ విమర్శల తీవ్రత మరింత పెరిగింది. గంభీర్ ట్వీట్ చేస్తూ...'నిరాశ చెందినా పోరాటం ఆపను, నన్ను లక్ష్యం చేసుకుని పక్కన పెట్టినా భయపడేంత పిరికివాడిని కాదు, జట్టులో చోటు లభించకపోయినంత మాత్రాన నేను ఓడినట్టు కాదు, నా సహచరుడు గెలిచినట్టు కాదు... నేను పోరాడుతాను, పోరాడుతాను' అంటూ ట్వీట్ చేశాడు. దీనికి వెటరన్లు, సీనియర్ల నుంచి మంచి స్పందన వస్తోంది.

More Telugu News