: డ్రెస్ బాగా లేదని భోజనం పెట్టమన్న స్టార్ హోటల్...సోషల్ మీడియాలో నెటిజన్ల మండిపాటు!

కస్టమర్ ధరించిన డ్రెస్ తమ నియమ నిబంధనలకు అనుగుణంగా ఉందా? లేదా? అన్న విషయాన్ని కొన్ని స్టార్ హోటళ్లు పక్కాగా పాటిస్తాయన్న సంగతి చాలా మందికి తెలియదు. కోల్ కతాలోని మొకాంబో హోటల్ కూడా అలాంటిదే. అందుకే, ఆ హోటల్ లో భోజనం చేయడానికని వెళ్లిన ఇద్దరికి చేదు అనుభవం ఎదురైంది. మొకాంబో హోటల్ జాజ్ మ్యూజిక్ కు ప్రసిద్ధి. తన కారు డ్రైవర్ కు మంచి భోజనం పెట్టించడం ద్వారా అతను చేసిన సేవలకు కృతజ్ఞతలు చెప్పాలని భావించి ఆ హోటల్ కు వెళ్లిన ఓ ఆటోమొబైల్ కంపెనీ మహిళా ఉద్యోగికి అక్కడి సిబ్బంది షాక్ ఇచ్చారు. వారితో వాగ్వాదానికి దిగినా ఫలితం లేకపోవడంతో ఆమె తన బాధను సోషల్ మీడియాలో వెళ్లగక్కడం ద్వారా ఉపశమనం పొందారు. వివరాల్లోకి వెళ్తే...దిలాషీ హేమ్నానీ ఆటోమొబైల్ కంపెనీలో ఉన్నతోద్యోగం చేస్తున్నారు. ఆమెకు అనేక సంవత్సరాలుగా కారు డ్రైవర్‌ గా మనీష్ భయ్యా సేవలందిస్తున్నారు. ఆమె కోల్‌ కతా నుంచి బదిలీ అయి వెళ్లిపోతుండటంతో, మనీష్‌ కు ఘనంగా పార్టీ ఇవ్వాలని నిర్ణయించుకుని, మొకాంబో హోటల్‌ కు తీసుకెళ్ళారు. కానీ అక్కడి సిబ్బంది డ్రైవర్ ను లోపలికి రానివ్వలేదు. ఆయన దుస్తులు బాగోలేవని చెప్పారు. ఆమె హోటల్ మేనేజర్‌ ను కలిసి, మనీష్‌‌ ను లోపలికి రానివ్వాలని డిమాండ్ చేశారు. ఆయన కూడా అంగీకరించకపోవడంతో ఆయనతో వాగ్వాదానికి దిగారు. అయినప్పటకీ ఫలితం లేకపోయింది. తమ కుటుంబానికి ఆయన చేసిన సేవలకు కృతజ్ఞతగా విందు ఇవ్వాలనుకున్న దిలాషీ హేమ్నానీ మనసు గాయపడింది. దీంతో జరిగిన ఘటన గురించి ఫేస్ బుక్ లో వివరాలు వెల్లడిస్తూ పోస్ట్ పెట్టారు. ఆ హోటల్‌ లో నిత్యం భోజనం చేసే చాలామంది కస్టమర్లు ఆ పోస్ట్ చూశాక, ఆయన పట్ల అనుచితంగా ప్రవర్తించినందుకు, హోటల్ యాజమాన్యం క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అలా యాజమాన్యం క్షమాపణలు చెప్పని పక్షంలో సిగ్నేచర్ పార్క్ వీధిలో ఉన్న ఈ మల్టీ క్యూజిన్ రెస్టారెంట్‌ ను బాయ్‌ కాట్ చేస్తామని హెచ్చరించారు. అయినా వీటిని బేఖాతరు చేస్తూ, ఆ హోటల్ మేనేజర్ ప్రకటన విడుదల చేశారు. కుల, మత, జాతి, వృత్తి భేదాలు లేకుండా అందరికీ స్వాగతం పలికే చిన్న రెస్టారెంట్ మొకాంబో అని, తమ హోటల్‌ కు వచ్చే అతిథులు పరిశుభ్రంగా, చక్కని దుస్తులు ధరించాలని మాత్రమే తాము కోరుకుంటున్నామని, ఆమెతో వచ్చిన డ్రైవర్ పరిశుభ్రమైన వస్త్రాలు ధరించలేదని, ఇతర అతిథులకు అసౌకర్యం కలుగకూడదనే ఉద్దేశంతోనే తాము ఆయనను లోనికి రానివ్వలేదని వివరణ ఇచ్చారు.

More Telugu News