: బెంగళూరులో 16 ప్రాంతాల్లో కొనసాగుతున్న కర్ఫ్యూ.. పోలీసు కాల్పుల్లో ఒకరి మృతి

కావేరీ జలవివాదంతో అట్టుడుకుతున్న కర్ణాటకలో నిన్న ప్రారంభమైన ఆందోళనలు హింసాత్మకంగా మారిన సంగతి తెలిసిందే. రోడ్లపైకి వచ్చిన ఆందోళనకారులు విధ్వంసం సృష్టించారు. తమిళులకు చెందిన హోటళ్లు, వాహనాలపై విరుచుకుపడ్డారు. యథేచ్ఛగా విధ్వంసానికి పాల్పడ్డారు. నిన్న ఒక్కరోజే ఆందోళనకారులు వంద వాహనాలను తగలబెట్టారు. ఆందోళనను అదుపు చేసేందుకు పోలీసులు జరిపిన కాల్పుల్లో ఒకరు మృతి చెందారు. ప్రస్తుతం బెంగళూరులోని 16 పోలీస్ స్టేషన్లలో కర్ఫ్యూ విధించారు. దీంతో నగరంలో అప్రకటిత బంద్ కొనసాగుతోంది. బస్సులు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మాండ్యాలో ఈనెల 17 వరకు విద్యాసంస్థలను మూసివేస్తున్నట్టు ప్రకటించారు. కర్ణాటక పరిస్థితిని కేంద్రం ఎప్పటికప్పుడు సమీక్షిస్తోంది. పది కంపెనీల ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ బలగాలను కర్ణాటకకు పంపించింది. జలవివాదంపై చర్చించేందుకు కర్ణాటక కేబినెట్ అత్యవసరంగా సమావేశం అవుతోంది. తమిళుల ప్రాణాలు, ఆస్తులు కాపాడాలంటూ కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత లేఖ రాశారు. సామాజిక మాధ్యమాల్లో వచ్చే వదంతులను నమ్మవద్దంటూ పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇరు రాష్ట్రాలు సంయమనం పాటించాలని హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ విజ్ఞప్తి చేశారు. సమస్యను పరిష్కరించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందన్నారు.

More Telugu News