: గురజాల-మాచర్ల రైల్వే ట్రాక్‌పై నుంచి ప్రవహిస్తున్న వర్షపు నీరు.. ఆగిన రైళ్లు

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వానలు కురుస్తున్నాయి. గురజాల-మాచర్ల రైల్వేట్రాక్‌పై నుంచి వర్షపు నీరు ప్రవహిస్తోంది. ఫలితంగా పలుచోట్ల రైల్వే ట్రాక్ దెబ్బతింది. దీంతో అధికారులు రైళ్ల రాకపోకలను నిలిపివేశారు. అలాగే దాచేపల్లి వద్ద నాగులేరు వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. పిడుగురాళ్ల మండలం కరాలపాడులో రాత్రి నుంచి ఆగకుండా వర్షం పడుతోంది. దీంతో వర్షానికి గోడకూలి ఓ మహిళ మృతి చెందింది. కారంపూడిలో రాత్రి పడిన వర్షానికి ఎర్రవాగు పొంగి ప్రవహిస్తోంది. వాగు ఉద్ధృతితో నాలుగు గ్రామాలకు వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. నాలుగు గ్రామాల్లో వరదనీరు ఇళ్లలోకి చేరడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. మాచర్ల మండలంలోని మండాది వద్ద వాగులు, వంకలు పొంగాయి. దీంతో గుంటూరు-ప్రకాశం జిల్లాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. మరోవైపు ప్రకాశం జిల్లావ్యాప్తంగా వర్షాలు పడుతున్నాయి. ఒంగోలులో రాత్రి పడిన వర్షానికి పోతురాజు కాల్వ పొంగింది. రహదారులు జలమయమయ్యాయి. చెరుకూరులో కురిసిన భారీ వర్షానికి త్రివిక్రమస్వామి ఆలయం జలయమమైంది. ఆలయంలోకి రెండు అడుగుల మేర నీరు చేరింది. ఒంగోలులో 15 సెంటీమీటర్లు, సంతనూతలపాడులో 14.4, తాళ్లూరులో 13.3, దర్శిలో 10.4, అద్దంకిలో 7.1, కురిచేడులో 9.4, ముండమూరు, మద్దిపాడులో 9.3 సెంటీమీటర్ల వర్షం కురిసింది.

More Telugu News