: మేము ఎంపిక చేసినా ఫైనల్ గా వాళ్లిద్దరూ ఖరారు చేయాల్సిందే!: చీఫ్ సెలెక్టర్ సందీప్ పాటిల్

భారత పర్యటనకు న్యూజిలాండ్ జట్టు రానున్న నేపథ్యంలో జట్టు ఎంపికపై చీఫ్ సెలెక్టర్ సందీప్ పాటిల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టీమిండియాను సెలెక్ట్ చేసిన అనంతరం ముంబైలో ఆయన మాట్లాడుతూ, జట్టులో ఎవరిని ఉంచాలి? ఎవరిని తీసేయాలి? అంటూ చాలా తర్జనభర్జనల తరువాత జట్టును ఎంపిక చేశామని అన్నారు. ఇందుకోసం తాము తయారు చేసిన ప్రాబబుల్స్ లో ఎవరికి స్థానం కల్పించాలో నిర్ణయించింది మాత్రం కెప్టెన్ కోహ్లీ, కోచ్ కుంబ్లే అని ఆయన తెలిపారు. వారిద్దరూ ఖరారు చేసిన తరువాతే జట్టును ఖరారు చేశామని ఆయన చెప్పారు. పేలవ ప్రదర్శనతో నిరుత్సాహపరుస్తున్న రోహిత్ శర్మను సిరీస్ కు దూరం పెట్టాలని భావించామని, అయితే కెప్టెన్, కోచ్ నిర్ణయం మేరకు ఆయనకు తుదిజట్టులో స్థానం కల్పించామని ఆయన చెప్పారు. దీంతో ప్రస్తుతం జట్టు ఎంపిక ఫార్మాలిటీ అన్నది సెలెక్షన్ బోర్డు చూసినా, చివరికి ఎంపిక చేసుకున్నది మాత్రం కోచ్ కుంబ్లే, కెప్టెన్ కోహ్లీ కావడం విశేషం.

More Telugu News