: ప్రపంచంలో తొలిసారిగా ఎయిడ్స్ ను జయించిన వ్యక్తి... మహమ్మారిపై మొదటి గెలుపు

ప్రపంచాన్ని మూడు దశాబ్దాల నుంచి వణికిస్తున్న ఎయిడ్స్ వ్యాధిని జయించాడో వ్యక్తి. హెచ్ఐవీ పాజిటివ్ వచ్చిన వ్యక్తికి ఏళ్ల తరబడి చికిత్స జరిపి శరీరం నుంచి వైరస్ ను పూర్తిగా పారద్రోలారు జర్మనీ వైద్యులు. ఈ మహమ్మారిపై పోరాడుతున్న లక్షలాది మందిలో కొత్త ఆశలు చిగురించేలా చేశారు. అమెరికాకు చెందిన ఈ వ్యక్తి పేరు తిమోతీ రాయ్ బ్రౌన్. ఎయిడ్స్ ను జయించిన తొలి వ్యక్తి. మరిన్ని వివరాల్లోకి వెళితే... 1966లో జన్మించిన రాయ్ బ్రౌన్ కు 1995లో ఎయిడ్స్ సోకినట్టు వెల్లడైంది. ఆపై చికిత్స కోసం బెర్లిన్ కు వెళ్లాడు. తనపైనే పరిశోధనలు చేయాలని డాక్టర్లను కోరాడు. 2007 నుంచి 'స్టెమ్ సెల్ ప్లాంటేషన్' అనే చికిత్సా పద్ధతి ద్వారా వైద్యులు, అతనిలోనీ సీడీ4 కౌంట్ ను పెంచేలా చర్యలు తీసుకున్నారు. దీంతో అతని రోగనిరోధక శక్తి పెరుగుతూ వచ్చింది. ఇదే సమయంలో రిట్రో వైరల్ థెరపీని చేస్తూ, కొన్ని సంవత్సరాలుగా రాయ్ బ్రౌన్ కు చికిత్స చేస్తూ వచ్చారు. ఇప్పుడు అతను హెచ్ఐవీ నెగటివ్. అతని శరీరంలో ఎక్కడా వైరస్ ఆనవాళ్లు లేవని, ఎయిడ్స్ నుంచి రాయ్ సురక్షితంగా బయటపడ్డాడని వైద్యులు వెల్లడించారు. ప్రాణాంతక వ్యాధి నుంచి రాయ్ ని కాపాడేందుకు తాము పడ్డ శ్రమ ఫలితాలనిచ్చిందని తెలిపారు. హెచ్ఐవీకి విరుగుడు కనిపెట్టేందుకు నేటి వైద్య శాస్త్రం దశాబ్దాలుగా పడుతున్న కష్టానికి రాయ్ బ్రౌన్ కథ కొత్త ఉత్సాహాన్ని ఇవ్వగా, ఆత్మ విశ్వాసం ఉంటే దేన్నైనా జయించవచ్చని నిరూపించాడితను.

More Telugu News