: చంద్రబాబు డైరెక్షన్ లో తెలంగాణ కాంగ్రెస్ యాక్షన్: హరీశ్ రావు నిప్పులు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆడించినట్టు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఆడుతోందని, ఆయన డైరెక్షన్ లో కాంగ్రెస్ యాక్షన్ చేస్తోందని తెలంగాణ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్ రావు నిప్పులు చెరిగారు. ఈ ఉదయం కరీంనగర్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ, తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలు కలసి ఆదివారం నాడు ధర్నా చేపట్టడాన్ని హరీశ్ గుర్తు చేశారు. పాలమూరు ప్రాజెక్టే వద్దని గతంలో వ్యాఖ్యానించిన చంద్రబాబుతో, కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారని ఆరోపించారు. జైపాల్ రెడ్డి గురించి ప్రజలకు బాగా తెలుసని, తెలంగాణ వాసులకు ద్రోహం చేసిన తెలుగుదేశంతో కాంగ్రెస్ ఎందుకు జత కట్టిందని హరీశ్ ప్రశ్నించారు. తాము నిర్మిస్తున్న ప్రాజెక్టులపై కాంగ్రెస్ పార్టీ రెండు నాల్కల ధోరణిలో వ్యవహరిస్తోందని, భూములు తీసుకోకుండా ప్రాజెక్టులు ఆకాశంలో కడతామా? అని కాంగ్రెస్ వ్యవహార శైలిని ఆయన ఎద్దేవా చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయితే, రెండు పంటలకు రైతులకు నీరందుతుందని ఆయన గుర్తు చేశారు.

More Telugu News