: హర్యానాలో దారుణం!... బీఫ్ తిన్నారని ఇద్దరు మహిళలపై గ్యాంగ్ రేప్, మరో ఇద్దరి హత్య!

దేశ రాజధానికి అత్యంత చేరువలో ఉన్న హర్యానాలో మరో దారుణ ఘటన వెలుగుచూసింది. బీఫ్ తిన్నారనే నెపంతో ఓ కుటుంబంపై దాడికి దిగిన కొందరు దుండగులు ఆ కుటుంబంలోని ఇద్దరు మహిళలపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. మరో ఇద్దరు మహిళలను దారుణంగా కొట్టి చంపారు. వారం క్రితమే ఆ రాష్ట్రంలోని మెవాక్ లో ఈ ఘటన చోటుచేసుకుంది. దుండగుల భీకర దాడితో బెంబేలెత్తిపోయిన బాధిత మహిళలు నిన్నటిదాకా నోరు విప్పేందుకే భయపడ్డారు. చివరకు నిన్న కాస్తంత ధైర్యం చేసిన బాధితులు ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల కథనం మేరకు... బీఫ్ తిన్నారన్న ఆరోపణలతో దుండగుల దండు ఓ రోజు బాధితుల ఇంటిలోకి చొరబడింది. ఆ సమయంలో ఇంటిలో ఉన్న ఇద్దరు మహిళలను మంచాలకు కట్టేసి తీవ్రంగా కొట్టింది. ఈ దాడి తాళలేక ఆ ఇద్దరు మహిళలు అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. ఆ తర్వాత భయాందోళనలతో వణికిపోతున్న మరో ఇద్దరు మహిళలపై దుండగుల దండు సామూహిక అత్యాచారం చేసింది. నిన్న బాధితుల నుంచి అందిన ఫిర్యాదుతో రంగంలోకి దిగినర పోలీసులు నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు.

More Telugu News