: హైదరాబాద్‌లో వ‌ర్షం.. వానలోనూ ఖైర‌తాబాద్ గ‌ణ‌ప‌తిని ద‌ర్శించుకోవ‌డానికి పోటెత్తిన భ‌క్తులు

ప‌శ్చిమ మ‌ధ్య‌ బంగాళాఖాతంలో ఉప‌రిత‌ల ఆవ‌ర్త‌నం కొన‌సాగుతోంది. రాగ‌ల 24 గంట‌ల్లో ఉప‌రిత‌ల ఆవ‌ర్త‌నం అల్ప‌ పీడ‌నంగా మారే అవ‌కాశం ఉందని, తెలుగు రాష్ట్రాల్లో భారీ వ‌ర్షాలు కురుస్తాయ‌ని హైద‌రాబాద్ వాతావ‌ర‌ణ కేంద్రం తెలిపింది. ఈరోజు హైదరాబాద్‌లోని ప‌లు ప్రాంతాల్లో ఓ మోస్త‌రు వ‌ర్షం కురుస్తోంది. ఖైర‌తాబాద్‌, కూక‌ట్‌ప‌ల్లి, జూబ్లిహిల్స్‌, పంజాగుట్ట‌ల్లో ఓ మోస్త‌రు వ‌ర్షం ప‌డుతోంది. మాదాపూర్‌, రాయ‌దుర్గం, సికింద్రాబాద్‌, ప్యాట్నీ, బేగంపేట ప్రాంతాల్లో జ‌ల్లులు ప‌డ్డాయి. ఆయా ప్రాంతాల్లో రోడ్ల‌పై నీరుచేరింది. వాహ‌నాలు మెల్లిగా ముందుకు క‌దులుతున్నాయి. మ‌రోవైపు, వ‌ర్షంలోనూ ఖైరతాబాద్ వినాయ‌కుడిని దర్శించుకోవ‌డానికి భ‌క్తులు భారీగా త‌ర‌లివ‌చ్చారు. వ‌ర్షంలో త‌డుస్తూనే భారీగ‌ణ‌నాథుడిని ద‌ర్శించుకుంటున్నారు. వీకెండ్ కావ‌డంతో భక్తులు అధికంగా త‌ర‌లివ‌స్తున్నారు. మ‌రికాసేప‌ట్లో భారీగ‌ణ‌నాథుడిని ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చంద్రబాబు నాయుడు కూడా దర్శించుకోనున్నారు.

More Telugu News