: గంటపాటు ప్రధానితో సమావేశమైన బీజేపీ ఏపీ నేతలు.. త్వరలో ఏపీలో సభలు పెడతామని వెల్లడి
ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా కోసం రాష్ట్రంలో పోరాటాలు తీవ్రరూపం దాల్చుతున్న నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ ఏపీ నేతలు ఈరోజు ఢిల్లీలో పర్యటిస్తున్నారు. గంటపాటు ప్రధాని మోదీతో వారు పలు అంశాలపై చర్చించారు. ఈరోజు మూడు గంటలకు వారు బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షాతో భేటీ కానున్నారు. ఈ సందర్భంగా ఏపీ మంత్రి కామినేని శ్రీనివాస్, బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ కంభంపాటి హరిబాబు మీడియాతో మాట్లాడుతూ.. ప్యాకేజీని ప్రకటించినందుకు ప్రధానికి కృతజ్ఞతలు తెలిపినట్లు పేర్కొన్నారు. రాష్ట్రానికి అన్యాయం చేసింది కాంగ్రెస్ నేతలు జైరాం రమేశ్, చిదంబరమేనని పేర్కొన్నారు. తమ పార్టీ త్వరలోనే ఏపీలో సభలు నిర్వహిస్తుందని చెప్పారు. ఏపీ అభివృద్ధికి వెంకయ్య ఎంతో కృషి చేస్తున్నారని కామినేని అన్నారు. ఆయనపై విమర్శలు తగవని పేర్కొన్నారు. వెంకయ్యను విమర్శించడం రాష్ట్రానికి మంచిదికాదని ఆయన చెప్పారు. ఏపీకి వెంకయ్య అండగా ఉంటారని స్పష్టం చేశారు. వెంకయ్య వల్లే ఏపీకి ఎన్నో పరిశ్రమలు వస్తున్నాయని ఆయన అన్నారు.