: స్పీకర్ పైకి అట్టముక్కను విసిరిన వైసీపీ సభ్యుడు!... తెలుగు మీడియాలో వైరల్ గా వీడియో!

ఏపీ అసెంబ్లీలో విపక్షం నానా బీభత్సం చేసిందన్న టీడీపీ ఆరోపణలు వాస్తవమేనని తేలిపోయింది. ఏపీకి ప్రత్యేక హోదాపై చర్చకు పట్టుబట్టిన వైసీపీ మూడు రోజుల సమావేశాలను స్తంభింపజేసింది. ఈ క్రమంలో రెండో రోజైన నిన్న ఆ పార్టీ సభ్యులు స్పీకర్ పోడియంపై దాదాపుగా దాడి చేసినంత పని చేశారు. తాజాగా నేడు తమ నిరసనలకు మరింత పదును పెంచిన వైసీపీ సభ్యులు అసెంబ్లీ కార్యదర్శి టేబుల్ పై చెప్పులతోనే ఎక్కేశారు. అప్పటికే స్పీకర్ పోడియాన్ని అన్ని వైపుల నుంచి చుట్టుముట్టిన వైసీపీ సభ్యుల నుంచి ఓ అట్టముక్క స్పీకర్ వైపు దూసుకువచ్చింది. దీనిని గమనించి మార్షల్స్ తేరుకునేలోగానే ఆ అట్టముక్క స్పీకర్ కోడెల శివప్రసాద్ ను తాకేసింది. ముఖానికి కిందుగా, ఛాతీకి కాస్త పైన కోడెలను తాకిన సదరు అట్టముక్క అక్కడే ఆయన కాళ్ల వద్ద పడిపోయింది. ఈ అట్టముక్కను విసిరేసిన ఎమ్మెల్యే ఎవరన్న విషయం మాత్రం తేలలేదు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో తెలుగు మీడియాలో వైరల్ గా మారిపోయింది. అట్టముక్క తగలగానే హెడ్ ఫోన్స్ ను తీసేసి విసురుగా పైకి లేచిన కోడెల ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

More Telugu News