: ఉరిశిక్ష విధిస్తే హాయిగా నవ్వాడు...జైలుకి తీసుకెళ్తుంటే బాధితురాలి సోదరుడిని కొట్టాడు!

జడ్జి ఉరిశిక్ష విధిస్తే అంకుర్ పన్వార్ హాయిగా నవ్వాడు. తీర్పు అనంతరం జైలుకి తీసుకెళ్తుంటే అతను హత్య చేసిన యువతి సోదరుడిపై దాడి చేసి కలకలం రేపాడు. వివరాల్లోకి వెళ్తే...2013లో ప్రీతి రాఠి అనే యువతిపై అంకుర్ పన్వార్ (26) ముంబైలో యాసిడ్ దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన ప్రీతి ప్రాణాలు కోల్పోయింది. దీంతో ఈ కేసులో నిందితుడికి శిక్ష పడేందుకు, విజయం సాధించేందుకు మూడేళ్లుగా ప్రీతి కుటుంబ సభ్యులు పోరాడుతున్నారు. దీంతో ముంబయ్ ప్రత్యేక మహిళా న్యాయస్థానం అతను మరణించే వరకు ఉరితీయాలని చెప్పింది. న్యాయమూర్తి ఎస్.షిండే తీర్పు వెలువరించిన సందర్భంగా దోషి అంకుర్ పన్వార్ హాయిగా నవ్వాడు. ఈ సమయంలో ఎందుకు నవ్వుతున్నావని ప్రీతి బంధువు అనిత యాదవ్ ప్రశ్నించారు. ఆమెతో అంకుర్ వాగ్వాదానికి దిగాడు. దీంతో ప్రీతి సోదరుడు హితేష్ అతనిని చెంపదెబ్బ కొట్టాడు. తీర్పు పూర్తయిన అనంతరం అంకుర్ ను జైలుకు తీసుకెళ్తున్న సమయంలో ప్రీతి బంధువులకు ఎదురుపడ్డాడు. ఈ సమయంలో హితేష్ పై అంకుర్ దాడిచేశాడు. పోలీసులు కల్పించుకుని విడిపించారు.

More Telugu News