: టీమిండియాలో కేఎల్ రాహుల్ పోటీ పెంచేశాడు: బ్యాటింగ్ కోచ్

టీమిండియా వన్డే, టెస్టు, టీ20 మూడు ఫార్మాట్లలో స్థిరమైన జట్టునే కొనసాగిస్తోంది. టీమిండియా ఆటగాళ్లతో పాటు, రిజర్వ్ బెంచ్ కూడా పటిష్ఠంగా కనిపిస్తోంది. దీంతో జట్టులోకి కొత్త ఆటగాళ్లు రావాలంటే తీవ్రంగా శ్రమించాల్సి వస్తోంది. అలాంటి సమయంలో కేఎల్ రాహుల్ జట్టులో పోటీ పెంచాడని టీమిండియా బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ తెలిపారు. కేఎల్ రాహుల్ అద్భుతమైన ఆటగాడని ఆయన అన్నారు. వెస్టిండీస్ సిరీస్ లో టీ20లో కేవలం 46 బంతుల్లో శతకం బాది నిరూపించుకున్నాడని ఆయన అన్నారు. నిలకడైన ఆటతీరుతో జట్టులో స్థానం కోసం ఆటగాళ్ల మధ్య పోటీని పెంచేశాడని ఆయన పేర్కొన్నారు. ప్రధానంగా టీమిండియా ఓపెనింగ్ స్థానం మధ్య తీవ్రమైన పోటీ కొనసాగుతోందని ఆయన తెలిపారు. శిఖర్ ధావన్, మురళీ విజయ్, కేఎల్ రాహుల్ మధ్య తీవ్రమైన పోటీ నెలకొందని ఆయన చెప్పారు. స్వదేశం, విదేశం అన్న తేడా లేకుండా వరుసగా సెంచరీలు చేయడం రాహుల్ ఆటతీరుకు నిదర్శనమని ఆయన తెలిపారు. గత కొంత కాలంగా మెరుగైన ఆటతీరు ప్రదర్శిస్తున్న టీమిండియా త్వరలో ప్రారంభం కానున్న న్యూజిలాండ్ సిరీస్ లో రాణించేందుకు ఇప్పటి నుంచే సన్నాహాలు ప్రారంభించిందని ఆయన తెలిపారు.

More Telugu News