: ఒడిశాలో అదుపుతప్పి లోయలో పడిన ప్రైవేటు బస్సు.. 16 మంది ప్రయాణికుల మృతి
ఒడిశా రాష్ట్రం అనుగుల్ జిల్లాలోని అత్మాలిక్ ప్రాంతంలో ఈరోజు ఉదయం బస్సు ప్రమాదం జరిగింది. అక్కడి మనిత్రి వంతెనపై నుంచి ప్రయాణిస్తున్న ఓ ప్రైవేట్ బస్సు ఒక్కసారిగా లోయలో పడడంతో 16 మంది ప్రయాణికులు మృతిచెందారు. మరో 17 మందికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను రెస్క్యూ సిబ్బంది బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. బస్సు బౌధ్ జిల్లా నుంచి అంగుల్ జిల్లాకి వెళుతుండగా వంతెనపై అదుపుతప్పడంతో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ప్రమాదంపై ఆ రాష్ట్రం సీఎం నవీన్ పట్నాయక్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గాయాలపాలయిన వారికి మెరుగైన వైద్య సాయం అందించాలని ఆదేశాలు జారీ చేశారు.