: మాయావతి వైపు మొగ్గు చూపుతున్న యూపీ వాసులు... బీఎస్పీ అతిపెద్ద పార్టీ అవుతుందంటున్న సర్వేలు

2017లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న ఉత్తరప్రదేశ్ లో ఈ దఫా హంగ్ ఏర్పడనుందని, మాయావతి నేతృత్వంలోని బహుజన్ సమాజ్ వాదీ పార్టీ అత్యధిక స్థానాలను గెలుచుకోవచ్చని తాజాగా విడుదలైన సర్వే ఒకటి అంచనా వేస్తోంది. ఎన్నికలకు మరో ఆరు నెలల సమయం ఉండగా, బీఎస్పీకి 169 సీట్లు రావచ్చని పేర్కొంది. పెరిగిన ధరలను కిందకు దించలేకపోవడం, ముఖ్యమంత్రి అభ్యర్థిని ముందుగా చెప్పలేకపోవడం బీజేపీని వెనక్కు లాగుతున్నాయని, ఆ పార్టీ రెండో స్థానంలో నిలవవచ్చని సుమారు 25 వేల మందిని భాగం చేస్తూ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. 403 అసెంబ్లీ సీట్లున్న రాష్ట్రంలో ప్రస్తుతం 224 సీట్లతో అధికారంలో ఉన్న సమాజ్ వాదీ 74 స్థానాలకు పరిమితం కానుందని, 47 సీట్లతో ఉన్న బీజేపీ 135 స్థానాలకు ఎగబాకుతుందని తెలిపింది. కాంగ్రెస్ స్థానాలు 28 నుంచి 15కు తగ్గుతాయని అంచనా వేసింది. తదుపరి ఎన్నికల్లో రాష్ట్రంలో పెరిగిన నేరాలు 29 శాతం, ధరల పెరుగుదల 18 శాతం, అవినీతి 16 శాతం, అభివృద్ధి లేమి 15 శాతం, నిరుద్యోగం 12 శాతం, మతపరమైన సమస్యలు 7 శాతం మేరకు ప్రభావాన్ని చూపనున్నాయని సర్వే తెలిపింది. మాయావతి సీఎంగా వస్తే బాగుంటుందని 32 శాతం మంది ప్రజలు అభిప్రాయపడుతుండగా, అఖిలేష్ యాదవ్ ను 15 శాతం మందే కోరుతున్నారని వివరించింది.

More Telugu News