: అసెంబ్లీ మార్షల్స్ పై వైకాపా సభ్యుల దాడి... పరిస్థితి అదుపులోకి రాక పది నిమిషాలు వాయిదా

'ప్రత్యేక హోదాపై' చర్చకు పట్టుబట్టిన వైకాపా, ప్రభుత్వం అందుకు తక్షణం అంగీకరించకపోవడంతో ఆగ్రహంతో వైకాపా సభ్యులు స్పీకర్ పోడియంలోకి దూసుకు వచ్చారు. ఈ క్రమంలో స్పీకర్ కు చుట్టూ నిలబడిన మార్షల్స్ పై వైకాపా సభ్యులు దాడి చేశారు. దీంతో ఒకింత ఆగ్రహానికి గురైన కోడెల, "మార్షల్స్ పై దాడి చేయవద్దు" అని పదే పదే విజ్ఞప్తి చేశారు. మీకు సభ్యత ఉంటే దయచేసి కూర్చోవాలని హితవు పలికారు. ప్రభుత్వం హోదాపై చర్చకు సిద్ధమేనని, అసెంబ్లీ ప్రశ్నోత్తరాల తరువాత, ప్రకటన చేసిన అనంతరం చర్చిద్దామని కోడెల వెల్లడించినా వైకాపా సభ్యులు అందుకు అంగీకరించలేదు. వైకాపా సభ్యులు చాలా పొరపాటు చేస్తున్నారని, ఈ దౌర్జన్యం సరికాదని కోడెల వ్యాఖ్యానించారు. వైకాపాలో కనీసం సీనియర్ సభ్యులయినా పోడియంలోకి వచ్చిన వారిని వెనక్కు పిలుచుకోవాలని అన్నారు. ఈ దశలో తమపై దూసుకువస్తున్న వైకాపా సభ్యులను మార్షల్స్ సైతం అడ్డుకోవాలని చూడటంతో, "మార్షల్స్... డు నాట్ టచ్ ది మెంబర్స్" అంటూ, పరిస్థితి అదుపులోకి రాకపోయేసరికి పది నిమిషాల పాటు సభను వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు.

More Telugu News