: చైనా తర్వాత మనమే.. వాయు కాలుష్యం వల్ల భారత్‌లో 1.4 మిలియన్ల మంది మృత్యువాత

వాయుకాలుష్యం భారత్‌ను భయపెడుతోంది. 2013లో దీని బారిన పడి ఏకంగా 1.4 మిలియన్ల మంది మృతిచెందినట్టు వరల్డ్ బ్యాంక్ తాజా నివేదిక పేర్కొంది. మనకంటే ముందు చైనా 1.6 మిలియన్ల మరణాలతో ముందుంది. వరల్డ్ బ్యాంక్, ఇనిస్టిట్యూట్ ఫర్ హెల్త్ మెట్రిక్స్ అండ్ ఎవాల్యుయేషన్ కలిసి గురువారం ఈ నివేదికను విడుదల చేశాయి. దీని ప్రకారం వాయు కాలుష్యం బారిన పడి వివిధ రోగాలతో ప్రపంచవ్యాప్తంగా 2013లో ఐదు మిలియన్ల మందికి పైగా చనిపోయారు. వీటిలో అత్యధిక మరణాలు, చైనా, ఇండియాలోనే చోటుచేసుకున్నాయి. వాయు కాలుష్యం కారణంగా ప్రజలు లంగ్‌కేన్సర్, గుండె జబ్బులు, బ్రాంకైటిస్ తదితర వ్యాధుల బారిన పడుతున్నారు. అత్యధిక జనాభా ఉన్న చైనా, ఇండియాలాంటి దేశాలే కాకుండా తక్కువ జనాభా ఉన్న బంగ్లాదేశ్, శ్రీలంక, పాకిస్థాన్‌లోనూ వాయు కాలష్యం కారణంగా ఎక్కువ శాతం మరణాలు సంభవిస్తున్నాయి. వాయుకాలుష్యం కారణంగా సంభవిస్తున్న మరణాల దేశాల జాబితాలోని తొలి 15 స్థానాల్లో వీటికీ స్థానం దక్కింది. చైనా, భారత్‌లు వరుసగా 4, 6 స్థానాల్లో నిలవగా బంగ్లాదేశ్, శ్రీలంక, పాకిస్థాన్‌లు వరుసగా 11, 12, 15 స్థానాల్లో నిలిచాయి. వాయు కాలుష్యం కారణంగా చైనా మొత్తంగా 1.6 ట్రిలియన్ డాలర్లు నష్టపోగా, భారత్ 560 బిలియన్ డాలర్లు నష్టపోయింది. చైనా జీడీపీలో పదిశాతం, ఇండియా జీడీపీకి 8.5శాతానికి ఇది సమానం.

More Telugu News