: అత్యాధునిక యుద్ధ హెలికాప్టర్లను రంగంలోకి దించుతున్న చైనా.. భారత్ ఆందోళన

చైనా తన పదాతి దళాలను మరింత పటిష్టం చేసే దిశగా అడుగులేస్తోంది. ఇందులో భాగంగా అత్యాధునిక డబ్ల్యూజెడ్-10 అనే యుద్ధ హెలికాప్టర్లను సిద్ధం చేస్తోంది. యుద్ధ ట్యాంకులు, ఎయిర్ టు ఎయిర్ లక్ష్యాలను ఇవి ఛేదించగలవు. చైనా తాజా చర్యలపై భారత్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇప్పటికే చాలా వరకు డబ్ల్యూజెడ్-10 హెలికాప్టర్లను పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(పీఎల్ఏ)కు సరఫరా చేసినట్టు ఆర్మీకి చెందిన టీవీ చానల్ పేర్కొంది. హెలికాప్టర్ల రాకతో ఆర్మీ వైమానిక దళం మరింత బలోపేతమైనట్టు తెలిపింది. ఆర్మీలోని అన్ని గ్రూపులకు కనీసం ఒక వైమానిక దళం ఉండేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్టు పీఎల్ఏ ఆర్మీ ఏవియేషన్ ఎక్విప్‌మెంట్ బ్యూరో సీనియర్ కల్నల్ ఝు గౌలోని తెలిపారు. హెలికాప్టర్లను మొదట యుద్ధ ట్యాంకులను ధ్వంసం చేసేందుకు తయారుచేశామని, కానీ ఇప్పుడు వీటికి ఎయిర్ టు ఎయిర్ లక్ష్యాలను కూడా ఇది ఛేదించే సామర్థ్యం కూడా వచ్చిందని పేర్కొన్నారు. ఈ హెలికాప్టర్లు యుద్ధంలో పాలుపంచుకోవడమే కాకుండా రవాణా పరంగానూ వీటిని ఉపయోగించుకునే అవకాశం ఉంది.

More Telugu News