: ప్రత్యేక హోదా కూడా నిధుల కేటాయింపులో భాగమే కదా?: అరుణ్‌జైట్లీ

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు ప్ర‌త్యేక హోదాకి బ‌దులుగా ఆర్థిక సాయం ప్ర‌క‌టించిన కేంద్రంపై ఏపీ ప్ర‌జ‌లు, ప్ర‌తిప‌క్ష పార్టీల నేత‌ల నుంచి విమ‌ర్శ‌లు వ‌స్తోన్న నేప‌థ్యంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌జైట్లీ స్పందించారు. ఈరోజు ఢిల్లీలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆయ‌న మాట్లాడుతూ... రెవెన్యూలోటు పూడ్చేందుకు కేంద్రం నిధులు విడుదల చేస్తుందని అన్నారు. ఏపీకి అన్ని విధాలా సాయం అందిస్తున్నామ‌ని పేర్కొన్నారు. ఏపీ ప్ర‌జ‌ల‌ను త‌ప్పుదోవ ప‌ట్టించేందుకు పలువురు రాజ‌కీయాలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. పెట్రోలియం సహా అన్ని శాఖలు ఏపీలో కోట్ల రూపాయ‌ల పెట్టుబ‌డి పెడుతున్నాయని అరుణ్‌జైట్లీ అన్నారు. ఏపీలో పెట్టుబ‌డులు పెట్టేందుకు మ‌రిన్ని ప్ర‌భుత్వం రంగ సంస్థ‌లు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. పోల‌వ‌రం ప్రాజెక్టుకు అవ‌స‌ర‌మైన ప్ర‌తి పైసాను కేంద్ర‌మే భ‌రిస్తుందని చెప్పారు. ఏడాదిన్న‌ర‌లో ఏపీలో 20కి పైగా సంస్థ‌లు నెల‌కొల్పామ‌ని అన్నారు. రాజ‌ధానికి నిధుల కేటాయింపులో జాప్యం ఉండబోద‌ని స్ప‌ష్టం చేశారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌జ‌ల‌కు అభివృద్ధిని చూపించేందుకు సిద్ధ‌మయ్యామ‌ని పేర్కొన్నారు. ప్రత్యేక హోదా కూడా నిధుల కేటాయింపులో భాగమే కదా? అని వ్యాఖ్యానించారు.

More Telugu News