: అసలు చంద్రబాబు ఎందుకు భయపడతాడు? ఇది నాకు అర్థం కావట్లేదు!: వెంకయ్యనాయుడు

తెలుగుదేశం- బీజేపీ పొత్తుపై కూడా కొందరు వ్యాఖ్యలు చేస్తున్నారని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. ఈరోజు మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ‘చంద్రబాబు నాయుడు ఎందుకో భయపడుతున్నాడని అంటున్నారు. చంద్రబాబునాయుడు ఎందుకు భయపడతాడు? ఇది నాకు అర్థం కావట్లేదు!. చంద్రబాబునాయుడు పనిచేస్తున్నాడు.. కేంద్రంతో సహకరిస్తున్నాడు. కేంద్రం, రాష్ట్రం కలిసి పనిచేయడం చారిత్రాత్మక అవసరం. కేంద్ర సహకారం లేకుండా రాష్ట్రం నేడున్న పరిస్థితుల్లో వేగంగా ముందుకు వెళ్లలేదు. ఈరోజు ప్రత్యేకహోదా డిమాండ్ చేసే వారందరికీ కావాల్సింది రాష్ట్రం ముందుకు వెళ్లడం కాదు. వాళ్లకు కావాల్సింది.. చంద్రబాబు దిగిపోతే.. ఆ హోదా వారికి కావాలని! అసలు ఆ హోదా ఇచ్చే అధికారం మన చేతుల్లో లేదు.. ప్రజల చేతుల్లో ఉంది.. ప్రజలు అప్పుడు నిర్ణయిస్తారు. చంద్రబాబు నాయుడు రాజీనామా చేస్తే అన్ని సమస్యలు పరిష్కారమవుతాయా? తెలుగుదేశం పార్టీ కేంద్రం నుంచి వైదొలగాలని కొందరు అంటున్నారు. పొత్తు పెట్టుకునే విషయం పార్టీలు నిర్ణయించుకుంటాయి. మీరేంటీ మధ్యలో? తెలుగుదేశం పార్టీ కేంద్రం నుంచి వైదొలిగితే మీకేమన్నా ఛాన్స్ ఉంటుందనా? తెలుగుదేశం - బీజేపీ కలిసి పోటీ చేశాయి. ప్రజలు ఆశీర్వదించారు.. అవకాశమిచ్చారు.. కలిసి పనిచేస్తున్నాము. కొన్ని సమస్యలుంటాయి.. కుటుంబంలోనే ఉంటాయి. ఆ సమస్యలను పరిష్కరించుకోవచ్చు’ అని వెంకయ్యనాయుడు అన్నారు.

More Telugu News