: ఐదేళ్లలో రెవెన్యూ లోటు కింద ఏపీకి రూ.22,113 కోట్లు: ప్రకటించిన కేంద్ర ఆర్థిక శాఖ
ఏపీకి ప్రత్యేక హోదాకు సమానంగా ప్రయోజనాలు కలిగే విధంగా ఆర్థిక సాయం చేస్తామని ఇప్పటికే ప్రకటించిన కేంద్రం ఈరోజు రాష్ట్రానికి చేయనున్న సాయం వివరాలను వెబ్సైట్లో పెట్టింది. 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల కేటగిరీలలో ఐదేళ్లలో రెవెన్యూ లోటు కింద రూ.22,113 కోట్లు ఇవ్వనున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది. దీనిలో ఇప్పటి వరకు రూ.3,979.5 కోట్లు ఇచ్చామని పేర్కొంది. మిగతాది వాయిదాల పద్ధతిలో చెల్లిస్తామని తెలిపింది. ఆంధ్రప్రదేశ్ నవ్య రాజధాని అమరావతికి మొత్తం రూ.3500 కోట్లు మాత్రమే చెల్లించనున్నట్లు కేంద్రం ఆర్థిక శాఖ వెబ్సైట్లో పేర్కొంది. ఇప్పటికే రూ.2500 కోట్లు ఇచ్చినట్లు పేర్కొంది. మరో వెయ్యి కోట్లు కూడా చెల్లిస్తామని తెలిపింది. వెనకబడిన జిల్లాల కోసం ఇప్పటికే రూ.1050 కోట్లు ఇచ్చినట్లు పేర్కొన్న ఆర్థిక శాఖ.. రానున్న రోజుల్లో మరో రూ.1050 కోట్లు ఇవ్వనున్నట్లు చెప్పింది.