: పంజాబ్‌లోనూ అదే ప‌రిస్థితి... కేజ్రీవాల్‌పై గాజులు విసిరిన మ‌హిళ‌లు

పంజాబ్ ఉప ముఖ్యమంత్రి సుఖ్బీర్ బాదల్‌పై ఢిల్లీ ముఖ్య‌మంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప‌లు ఆరోప‌ణ‌లు చేశారు. బాదల్ వద్ద 63 నకిలీ సీడీలు ఉన్నాయని, అవ‌న్నీ ఆమ్ ఆద్మీ పార్టీకి వ్య‌తిరేకంగా ఉన్న సీడీలేన‌ని ఆయ‌న అన్నారు. అంతేగాక‌, ఆ సీడీలను రోజుకు రెండుమూడు చొప్పున రిలీజ్ చేస్తార‌ని కేజ్రీవాల్ ఆరోపించారు. ఈ అంశాల‌పై త‌మ వ‌ద్ద స‌మాచారం ఉంద‌ని పేర్కొన్నారు. పంజాబ్ అసెంబ్లీ ఎన్నిక‌ల ప్ర‌చారంలో పాల్గొన‌డానికి కేజ్రీవాల్‌ లుథియానా చేరుకున్నారు. అయితే ఆయ‌న రాక‌ను నిర‌సిస్తూ రైల్వే స్టేషన్ వ‌ద్ద కాంగ్రెస్, అకాలీదళ్ పార్టీల నేత‌లు నిర‌స‌న‌లు తెలిపారు. ఆమ్ ఆద్మీ పార్టీ నేత‌లు పలువురు లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న విష‌యం తెలిసిందే. వారిపై కేజ్రీవాల్‌ చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్, అకాలీదళ్ నేత‌లు డిమాండ్ చేశారు. ‘కేజ్రీవాల్ గో బ్యాక్’ అని నినాదాలు చేస్తూ నిర‌స‌న తెలిపారు. అంతేగాక నిర‌స‌న తెలుప‌డానికి వ‌చ్చిన‌ కొంత మంది మహిళలు కేజ్రీవాల్ పైకి గాజులు విసిరారు. లుథియానా అకాలీదళ్ అధ్యక్షుడు గురుదీప్ సింగ్ గోషా కేజ్రీవాల్ రాక‌ను వ్య‌తిరేకిస్తూ నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న‌లో పాల్గొన్నారు. అంత‌కు ముందు ఢిల్లీ రైల్వే స్టేషన్ లో కూడా కేజ్రీవాల్ కు ఇటువంటి అనుభ‌వ‌మే ఎదురైంది. స్టేషన్ లో మహిళలు ఆయ‌న‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

More Telugu News