: మూడేళ్ల చిన్నారిని కారులో వదిలి హోటల్‌కు వెళ్లిన తల్లిదండ్రులు.. హైదరాబాద్‌లో కలకలం

నిద్రపోతున్న మూడేళ్ల కుమార్తెను కారులో వదిలేసి డోర్ లాక్ చేసి, తల్లిదండ్రులు టిఫిన్‌కు వెళ్లారు. నిద్రలేచిన చిన్నారి ఏడుస్తూ లోపల నుంచి విండో బాదుతుంటే, గుమిగూడిన స్థానికులు కారు డోర్‌ను బద్దలుకొట్టి పాపను బయటకు తీశారు. హైదరాబాద్‌ శివారు శంషాబాద్‌లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అయింది. హైదరాబాద్‌కు చెందిన దంపతులు కారులో బెంగళూరు బయలుదేరారు. శంషాబాద్ చేరుకున్న తర్వాత టిఫిన్ చేయాలని భావించిన వారు నిద్రిస్తున్న కుమార్తెను కారులోనే వదిలి హోటల్‌కు వెళ్లారు. వారు వెళ్లిన కాసేపటికే నిద్రలేచిన బాలిక తల్లిదండ్రులు కనిపించకపోవడం, కారు లాక్ చేసి ఉండడంతో ఏడుపు మొదలు పెట్టింది. కారులో ఏడుస్తున్న చిన్నారి విండో బాదుతూ కనిపించడంతో ఏ జరిగిందోనని స్థానికులు గుమిగూడారు. కారు డోర్ తెరిచే ప్రయత్నం చేశారు. పోలీసులు కూడా అక్కడికి చేరుకున్నారు. కారు డోర్‌ను ఎలా తీయాలో సైగల ద్వారా చెప్పినా చిన్నారి అర్థం చేసుకోలేక మరింత ఏడుపు మొదలుపెట్టింది. చివరికి ఓ వ్యక్తి బలవంతంగా డోర్ తెరిచి పాపను బయటకు తీశాడు. ఈలోగా పాప తల్లిదండ్రులు అక్కడికి చేరుకున్నారు. విషయం తెలిసి తల్లిదండ్రులపై అక్కడున్న వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే పాప నిద్రిస్తుండడం వల్లే అలా చేయాల్సి వచ్చిందని వారికి సర్దిచెప్పారు. అనంతరం అక్కడి నుంచి బెంగళూరుకు బయలుదేరారు.

More Telugu News