: హైకోర్టులో సినీ హీరో విశాల్ పిటిషన్.. చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీసులను ఆదేశించాలని విన్నపం

సినీ హీరో, తమిళ నడిఘర్ సంఘ కార్యదర్శి విశాల్ బుధవారం మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దక్షిణ భారత నటీనటుల సంఘం ఆవరణలో జరిగిన వివాదంపై పోలీసులు చర్యలు తీసుకునేలా ఆదేశించాలని ఆయన తన పిటిషన్‌లో కోరారు. సంఘంలో జరుగుతున్న కొన్ని కార్యక్రమాల గురించి సంఘ సభ్యుడైన వారాహి వివరాలు కోరారని, మార్చి, ఏప్రిల్ నెలల్లో రెండుమార్లు లేఖలు రాశారని తెలిపారు. అతడి ప్రశ్నలకు వివరణ ఇచ్చేందుకు గతనెల 27న కార్యాలయానికి రావాలని చెప్పడంతో వచ్చిన ఆయన.. కార్యవర్గ సభ్యులు, న్యాయసలహాదారుడితో మాట్లాడేందుకు నిరాకరించారని విశాల్ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఆ తర్వాత వారాహి నేరుగా మీడియాతో మాట్లాడుతూ సంఘంపై పలు ఆరోపణలు చేశారని తెలిపారు. అది సరికాదని వారించినందుకు సంఘ సభ్యులను బెదిరించాడని పేర్కొన్నారు. ఈ ఘటనపై తేనాంపేట పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని తెలిపారు. తమ ఫిర్యాదుపై పోలీసులు స్పందించి కేసు నమోదు చేసి, వారాహిపై చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీసులను ఆదేశించాలని పిటిషన్‌లో విశాల్ అభ్యర్థించారు. పిటిషన్‌పై కోర్టు త్వరలో విచారించనుంది.

More Telugu News