: తలకు బాల్ తగలడంతో కుప్పకూలిన ప్రజ్ఞాన్ ఓజా!

భారత బౌలర్ ప్రజ్ఞాన్ ఓజా తలకు బాల్ తగలడంతో మైదానంలోనే కుప్పకూలిపోయాడు. దులీప్ ట్రోఫీలో భాగంగా గ్రేటర్ నోయిడాలో ఇండియా గ్రీన్, ఇండియా బ్లూ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్ లో ఈ సంఘటన జరిగింది. ఇండియా గ్రీన్ జట్టు తరపున ఓజా ఫీల్డింగ్ చేస్తున్న సందర్భంలో అతనికి తలకు వెనుక భాగంలో బాల్ తగిలింది. బౌలర్ జలజ్ సక్సేనా వేసిన బంతిని ఇండియా బ్లూ జట్టు ఆటగాడు పంకజ్ సింగ్ మిడాన్ మీదుగా షాట్ కొట్టాడు. అక్కడ ఫీల్డింగ్ చేస్తున్న ఓజా వైపునకు ఊహించని విధంగా బాల్ రావడంతో అతను వెనక్కి తిరిగాడు. దీంతో తల వెనుక భాగంలో ఆ బంతి తగలడంతో విలవిలలాడిపోయిన ఓజా కుప్పకూలిపోయాడు. వెంటనే ఇండియా గ్రీన్ హెడ్ కోచ్ రమన్ సహాయంతో ఓజాను ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం ఓజాకు ఎటువంటి ప్రమాదం లేదన్న విషయం నివేదికల ద్వారా తెలిసింది. కాగా, ఈ సమాచారం తెలుసుకున్న బీసీసీఐ అధికారులు ఓజాకు ఫోన్ చేసి పరామర్శించారు. ఓజా కోలుకునే వరకు ఆసుపత్రిలోనే ఉంచనున్నట్లు సమాచారం.

More Telugu News