: రాజన్ వెళ్లిపోయిన వేళ, 'ఇస్లామిక్ ఫైనాన్స్'కు తెరలేపిన ఆర్బీఐ!

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ గా రఘురాం రాజన్ పదవీ కాలాన్ని ముగించుకుని ఉర్జిత్ పటేల్ కు బాధ్యతలు అప్పగించిన వేళ, దేశంలోని ముస్లిం మైనారిటీ ప్రజలకు మెరుగైన రుణ లభ్యతే లక్ష్యంగా 'ఇస్లామిక్ ఫైనాన్స్' విధానాన్ని తేవాలన్న ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. ఈ మేరకు తన వార్షిక ప్రణాళికలో ఆర్బీఐ ప్రపోజల్స్ వెలువడ్డాయి. నాన్ బ్యాంకింగ్ చానల్స్ ద్వారా దేశంలోని 18 కోట్ల మంది ముస్లిం మైనారిటీలకు ఇస్లామిక్ చట్టాల ప్రకారం, వడ్డీ రహిత రుణాలకు పచ్చజెండా ఊపేలా నిర్ణయాలు తీసుకునేందుకు ముందడుగు పడింది. ఈ విషయంలో భారత ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నట్టు ఆర్బీఐ వెల్లడించింది. "ఆర్బీఐ తొలిసారిగా ఇస్లామిక్ ఫైనాన్సింగ్ విధానంపై నిర్మాణాత్మక వ్యాఖ్యలు చేయడాన్ని, ప్రతిపాదించడాన్ని స్వాగతిస్తున్నాం. దీని వల్ల కోట్లాది మంది ముస్లిం ఔత్సాహికులకు, వ్యాపారులకు మేలు కలుగుతుంది" అని బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న ఇన్ఫినిటీ కన్సల్టెంట్స్ మేనేజింగ్ పార్ట్ నర్ సైఫ్ అహ్మద్ వ్యాఖ్యానించారు. ఇండియాలో ఇస్లామిక్ బ్యాంకింగ్ విధానం అమల్లోకి రావాలంటే, సమాంతర చట్టం లేదా ఇప్పుడున్న చట్టాలకు సవరణలు తప్పనిసరని ఆయన గుర్తు చేశారు. షరియా చట్టాల ప్రకారం, ఇచ్చిన అప్పుపై వడ్డీని తీసుకోవడం నిషేధం కాగా, పలు అరబ్ దేశాల్లో ఈ విధానం అమలవుతోంది. ఈ విధానంలో భారత ముస్లిం సంస్థలు రుణాలను తీసుకుంటే, మిగతా కంపెనీలు ఒత్తిడిలో పడతాయన్నది పారిశ్రామిక వర్గాల వాదన.

More Telugu News